ఆ ముగ్గురు అధికారులు ఓ బ్రాండ్.. వారికే ఈసీ సైలెంట్ బ్యాండ్!

by Disha Web Desk 4 |
ఆ ముగ్గురు అధికారులు ఓ బ్రాండ్.. వారికే ఈసీ సైలెంట్ బ్యాండ్!
X

దిశ, రాచకొండ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటి సారిగా కేంద్ర ఎన్నికల కమిషన్ ముగ్గురు పోలీసు కమిషనర్‌లు, 10 మంది జిల్లా ఎస్పీ‌లతో పాటు ఐఏ ఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారులపై ఎన్నికల సమయంలో ఎలాంటి బాధ్యతలు లేకుండా కూర్చోమనడం సంచలనం రేపుతోంది. ఎప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఎలక్షన్ సమయంలో చర్యలు తీసుకోవడం ఇదే మొదటి సారి కావడంతో ఈ అధికారుల గురించి ఇప్పుడు ప్రజల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ఇప్పటి వరకు ప్రజల్లో గుర్తింపు పొందిన అధికారులు ఒక్క సారిగా ఇలా ఎన్నికల కమిషన్ అగ్రహానికి గురైన తీరు హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్న ఎస్‌ఎస్‌పీ యాదవ్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసి వీకే మొహంతిని నియమించి ఎన్నికలను నిర్వహించారు. అప్పట్లో ఒక డీజీపీని మార్చి ఎన్నికలను నిర్వహించడం పెద్ద సెన్సేషన్‌ అయింది. అప్పుడు ఎస్‌ఎస్‌పీ యాదవ్, ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న అధికార పార్టీకి విధేయుడిగా పని చేస్తున్నాడని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు వెళ్లడంతో ఎన్నికల సంఘం డీజీపీ మీద కొరడా ఝాల్లుపించింది.

వివాదస్పద కేసులే కారణమా..

ఎమ్మెల్యే కొనుగలు వ్యవహారంలో సిట్ ఇంచార్జిగా ఉన్నందుకు, ఆ కేసులలో బీఎల్ సంతోష్‌ను నిందితుడిగా చేర్చినందుకు సీవీ ఆనంద్ అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ పరిణామం ఎఫెక్ట్ తోనే ఇప్పుడు వేటు పడినట్లు అటు అధికారులు ఇటు ప్రతిపక్ష పార్టీల వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎస్‌ఎస్‌సీ పరీక్ష పత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్‌ను అనుమానితుడిగా చేర్చడంతో వరంగల్ కమిషనర్ రంగనాథ్ రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువు అయ్యాడు. దాని ఫలితమే బదిలీ వేటు అయ్యి ఉండవచ్చని పోలీసు వర్గాల్లో టాక్.

ఇక కరీంనగర్ కమిషనర్ గా ఉన్నప్పుడు సత్యనారాయణ బండి సంజయ్ నిరసన దీక్షను భగ్నం చేసే సమయంలో తలుపులు బద్దాలు కొట్టి ఎంపీని అదుపులోకి తీసుకోవడం అది నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులు కమిషనర్ మీద వెల్లువతాయి. ఇలా ప్రతి పక్ష పార్టీ నాయకులు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తునారనే ఫిర్యాదులు తరచూ వెళ్లడంతోనే వేటు పడినట్లు తెలుస్తోంది. తమదైన శైలిలో విధులు నిర్వహించాల్సిన బ్రాండ్ కలిగిన అధికారులను ఇప్పుడు సైలెంట్‌గా ఉండమనడం పోలీసు డిపార్ట్‌మెంట్‌లో సరి కొత్త హిస్టరీని ఎలక్షన్ కమిషన్ రాసిందని జోరుగా చర్చ సాగుతోంది.


Next Story

Most Viewed