కేంద్ర బడ్జెట్‌.. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ రియాక్షన్ ఇదే..!

by Rajesh |
కేంద్ర బడ్జెట్‌.. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ రియాక్షన్ ఇదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం 2024-25కు గాను ఏర్పాటు చేసిన మధ్యంతర బడ్జెట్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలిచేందుకు కాదని, కేవలం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించి బడ్జెట్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బడ్జెట్ పేదల సంక్షేమం, యువత సాధికారత, వ్యవసాయం, నారీశక్తి సాధికారత కోసం ప్రకటించినట్లు చెప్పారు. ఈ పదేండ్లలో పేదరికం గణనీయంగా తగ్గడంతో పాటుగా.. వివిధ రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధ్యమైందన్నారు.

వికసిత భారత సంకల్ప లక్ష్యాలను ఈ బడ్జెట్ ప్రతిబింబించిందని పేర్కొన్నారు. దేశంలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పన కోసం మౌలిక వసతుల రంగంపై చేయాల్సిన వ్యయాన్ని 11.1శాతానికి పెంచిందన్నారు. ఈ మొత్తం 11.11 లక్షల కోట్లుగా వారు చెప్పుకొచ్చారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో.. ఇళ్ల పైకప్పులపై.. సోలార్ ప్యానెళ్లను ఏర్పాటుచేసే ప్రక్రియకు ఈ బడ్జెట్ లో శ్రీకారం చుట్టారన్నారు. కోటి ఇండ్లకు సోలార్ ప్యానెళ్లను అమర్చడం ద్వారా.. ప్రతి నెలా ఒక్కో ఇంటినుంచి 300 యూనిట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంతో పనిచేయనున్నారని పేర్కొన్నారు.

మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కిరాయి ఇళ్లలోనే ఉంటున్నారని గుర్తించి.. వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు రుణసదుపాయం కల్పించనున్నట్లు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తెలిపారు. ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజనలో భాగంగా నిర్దేశించుకున్న 3 కోట్ల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకున్నందున.. మరో 2 కోట్ల ఇళ్లను వచ్చే ఐదేళ్లలో నిర్మించే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారన్నారు. దేశవ్యాప్తంగా 83 లక్షల స్వయం సహాయక బృందాల్లోని 9 కోట్ల మంది మహిళలు.. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక-ఆర్థిక ప్రగతిలో కీలక భూమిక పోషించనుందని వారు పేర్కొన్నారు.

ఇలాంటి వారిలో చాలా మంది ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచి కనీసం 2 కోట్ల మందిని లక్షాధికారులుగా చేయాలన్న టార్గెట్‌ను 3 కోట్లకు పెంచారన్నారు. ప్రఖ్యాత పర్యాటక క్షేత్రాలను అభివృద్ధి చేయడంతోపాటుగా.. వాటిని అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్, మార్కెటింగ్ చేయడంపైనా ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పించారని వారు వెల్లడించారు. 40వేల సాధారణ రైలు బోగీలను వందేభారత్ ప్రమాణాలతో ఆధునీకరించనున్నారని వెల్లడించారు.

2009-10 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న రూ.25వేల వరకు ఔట్‌స్టాండింగ్ డైరెక్ట్ టాక్స్ డిమాండ్స్, 2010-11 నుంచి 2014-15 వరకు ఉన్నటువంటి రూ.10వేల ఔట్‌స్టాండింగ్ డైరెక్ట్ టాక్స్ డిమాండ్స్ ను వెనక్కు తీసుకుంటున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారని వారు తెలిపారు. దీని వల్ల కోటి మంది పన్ను చెల్లింపుదారులకు మేలు జరగనుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిని ఆశావర్కర్లు, అంగన్ వాడీ వర్కర్లకు అందించనున్నారని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తెలిపారు.

Next Story

Most Viewed