BRS కొత్త పేరు HRS.. నల్గొండ సభలో మంత్రి కొమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-06-28 12:15:31  IST  )

బీఆర్ఎస్, బీజేపీపై నల్గొండ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిప్పులు చెరిగారు. హ్యామ్ రోడ్ల టెండర్లు, మూసీ ప్రక్షాళనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

BRS కొత్త పేరు HRS.. నల్గొండ సభలో మంత్రి కొమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్‍పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హ్యామ్ రోడ్లకు టెండర్లు పిలవకముందే అవినీతి అంటూ హరీశ్ రావు, కేటీఆర్ మాట్లాడుతున్నారని పూటకో పేరు మార్చుకునే పార్టీ కాంగ్రెస్ ను విమర్శిస్తోందని దుయ్యబట్టారు. నిన్న టీఆర్ఎస్, ఇవాళ బీఆర్ఎస్, రేపు హెచ్ఆర్ఎస్(హరీశ్ రావు రాష్ట్ర సమితి) అవుతుందని కానీ కాంగ్రెస్ అంటే శాశ్వతం అని సెటైర్ వేశారు. ఇవాళ నల్గొండ జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి కేసీఆర్ పదేళ్లపాటు నల్గొండ జిల్లాకు మోసం చేశారని, కుర్చి వేసుకుని కూర్చుని మన ప్రాజక్టులు పూర్తి చేస్తామని విస్మరించారన్నారు.

కాళ్లలో కట్టె పెట్టే ప్రయత్నం:

రాష్ట్రంలో కేటీఆర్, హరీశ్ రావులకు ఎలాంటి పని లేదని అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏం మంచి పని చేయాలని తలపెట్టినా కాళ్లల్లో కట్టె పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు కాళేశ్వరం, ధరణి పేరుతో దోచుకున్న వాళ్లకు మిగతా వాళ్లు కూడా అలాగే దోచుకుంటారని అనుకుంటున్నారని విమర్శించారు. పూటకో సారి పార్టీ పేరు మార్చుకునే మీరు మా గురించి మాట్లాడుతారా అని ప్రశ్నించారు. ఎస్ఎల్‍బీసీ పై ఈ దొంగల కన్ను పడిందని, ఇది పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని నల్గొండ ప్రజలకు మేలు జరుగుతుందనే ఓర్వలేకపోతున్నారన్నారు. నల్గొండ ప్రజలు అడగకముందే సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనకు పూనుకున్నారని ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తున్న కిషన్ రెడ్డి ఓ సారి మూసీ ఒడ్డున పడుకోవాలన్నారు.

పదేళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు:

పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులకు పశువులు తినే నాసిరకమైన బియ్యం ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. కానీ మేము అధికారంలోకి వచ్చాక పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఇందిరమ్మ ప్రభుత్వం దూసుకుపోతోందని చెప్పారు. గతంలో ఇందిరమ్మ, వైఎస్సార్ హాయంలోనే అత్యధికంగా ఇండ్లు ఇస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే మళ్లీ ఊరూరా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. కేసీఆర్ హాయంలో రాష్ట్రంలో రోడ్లను మరమ్మతులు చేయని పరిస్థితి ఉండేదని కానీ ఇవాళ రూ.13,006.27 కోట్లు అంచనా వ్యయంతో హ్యామ్ రోడ్లు నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇవాళ నల్గొండ NG కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.
Next Story