జడ్జీల నియామకాల్లో ఏకరూపత ఉండాలి.. రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-02 12:36:33  IST  )

దేశవ్యాప్తంగా న్యాయ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ఐఏఎస్, ఐపీఎస్ తరహాలోనే అఖిల భారత న్యాయ సేవను వెంటనే ఏర్పాటు చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

జడ్జీల నియామకాల్లో ఏకరూపత ఉండాలి.. రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా న్యాయ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) తరహాలోనే అఖిల భారత న్యాయ సేవ (All India Judicial Service - AIJS) ను వెంటనే ఏర్పాటు చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇవాళ ఆయన రాజ్యసభ (Rajya Sabha)లో మాట్లాడుతూ.. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న విధానం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీని స్థానంలో ఓ జాతీయ స్థాయి వ్యవస్థను తీసుకురావాలనిసూచించారు. యూపీఎస్సీ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల మాదిరిగానే, న్యాయమూర్తుల ఎంపికకు కూడా ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఉండాలని కామెంట్ చేశారు. దీంతో ప్రతిభావంతులైన యువతకు న్యాయ వ్యవస్థలో సరైన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

అఖిల భారత న్యాయ సేవ ఏర్పాటుతో ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC) ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు న్యాయ వ్యవస్థలో తగిన ప్రాతినిధ్యం లభిస్తుందని లక్ష్మణ్ అన్నారు. నియామకాల్లో పారదర్శకత పెరగడం వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడుతుందని పేర్కొన్నారు. సమర్థులైన న్యాయమూర్తులు తక్కువ వయస్సులోనే విధుల్లోకి రావడం వల్ల, కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుందని అన్నారు.

రాజ్యాంగ నిబంధనల ప్రస్తావన..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 312 ప్రకారం అఖిల భారత న్యాయ సేవను ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు ఉందని లక్ష్మణ్ గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన నిబంధనలు, వేతనాలు శిక్షణా విధానం ఉండటంతో న్యాయ పంపిణీ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు, న్యాయ నిపుణులు దీనిపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారని, త్వరలోనే కేంద్రం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని డాక్టర్ లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చారు.

తెలంగాణ వ్యవసాయంపై కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం.. మంత్రి తుమ్మల ఆగ్రహం

Next Story