బీఆర్ఎస్‌తో సీపీఐకి చెడిందా.. కర్ణాటక రిజల్ట్‌తో రూటు చేంజ్?

by Disha Web Desk 2 |
బీఆర్ఎస్‌తో సీపీఐకి చెడిందా.. కర్ణాటక రిజల్ట్‌తో రూటు చేంజ్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు బై పోల్‌లో బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచిన సీపీఐతో స్నేహం చెడిందా.? అనే అనుమానాలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ తో సీపీఐ, సీపీఎంలు కలిసి పనిచేస్తామని ఇదివరకే ప్రకటించాయి. కాగా..సాధారణ ఎన్నికలు సమీపిస్తుండగా పొత్తులపై ఇప్పటివరకు ఆయా పార్టీల నేతలు క్లారిటీ ఇవ్వడంలేదు. దీంతో ఎలాంటి స్పష్టత లేకపోగా కేడర్ లోనూ కన్ఫ్యూజన్‌ నెలకొంది.

కర్ణాటక రిజల్ట్ తో మారిన రూటు?

బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేస్తున్నామని సీపీఐ మొదటి నుంచి చెబుతూ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ పొత్తులపై ఎలాంటి స్పష్టత లేకపోగా.. రూట్ మార్చుతున్నారా? అనే అనుమానాలు ఇటీవల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన కామెంట్స్‌తో తేటతెల్లమవుతుంది. కర్ణాటకలో 212 సెగ్మెంట్లలో తాము కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామని.. తెలంగాణలో పొత్తులపై పునరాలోచిస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై జాతీయ సమావేశాల్లోనూ చర్చిస్తామని కూడా స్పష్టంచేశారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ప్రభావం తెలంగాణపైన కూడా ఉంటుందని రాజకీయ విశ్లేషకుల మాట. దీంతో బీఆర్ఎస్‌తో సీపీఐ దోస్తీ కటీఫ్ చెప్పి.. కొత్త దోస్త్ కాంగ్రెస్‌ వైపు చూస్తుందనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీఆర్‌ఎస్‌తో తొందరగా సీట్లపై అంచనాకు వస్తే.. గ్రౌండ్‍ లెవల్‍ లో పనిచేసి జెండా ఎగర వేయాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. అలాకాకుండా మరింత ఆలస్యమైతే ఎన్నికల ఈక్వేషన్స్ మారుతాయనడంలోనూ సందేహం లేదు. మరి సీపీఐ.. హస్తం అందుకుంటుందా.? లేదా.? అనేది ఇంకొన్ని రోజుల్లో తేలనుంది.

రాష్ట్రంలోని సమస్యలపైనా గళం

ఇటీవల ఇంటింటికి సీపీఐ పేరుతో యాత్రలు, సభలు నిర్వహించగా జాతీయ నేతలు సైతం హాజరయ్యారు. ముఖ్యంగా ఈ యాత్ర ఉద్దేశం ‘బీజేపీ కో హఠావో, దేశ్ కో బచావో’ నినాదంతో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని స్పష్టంచేశారు. కేవలం కేంద్రం విధానాలపై మాత్రమే గళం విప్పారు. రాష్ట్రంలోని సమస్యలపై సీపీఐ పోరాటం కేవలం పత్రిక ప్రకటనలు, ప్రెస్‌మీట్ లకే పరిమితమైందని, ఆ పార్టీ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నదని పలువురు రాజకీయ నేతలు విమర్శించారు. ప్రజల్లో సైతం ఎర్ర జెండాలు బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడం లేదనే ఆరోపణలు వచ్చాయి. వీటికి చెక్ పెడుతూ.. ‘జూన్ 4న కొత్తగూడెంలో ‘సీపీఐ ప్రజాగర్జన’ పేరుతో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికై నినదిస్తాం’.. అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని స్పష్టంచేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కౌలు రైతులు, ధరణి లోపాలు, రైతు రుణమాఫీ, పోడు భూములు, గిరిజన, నిరుద్యోగ, కాంట్రాక్ట్ ఉద్యోగుల లాంటి అనేక సమస్యలపైనా నినదిస్తామని పేర్కొన్నారు. జాతీయ నేతలు హాజరవడమే కాకుండా లక్షమందితో భారీ సభను ఏర్పాటు చేయనుంది.

పూర్వవైభవానికి ప్లాన్

పార్టీని ఎన్నికలకు ముందు సమాయత్తం చేసే లక్ష్యంతో అధిష్టానం పనిచేస్తుంది. కేడర్ ఎలాంటి గందరగోళానికి గురికాకుండా భరోసా నింపేందుకు ప్రజాగర్జన సభను లక్ష మందితో విజయవంతం చేసే దిశగా సీపీఐ అధిష్టానం నిమగ్నమైంది. పార్టీ పూర్వవైభవానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రజా పోరాటాల నిర్మాణానికి సిద్ధమైంది.

Read more:

హాట్ న్యూస్: రాబోయే ఎన్నికల్లో మునుగోడులో బీజేపీకి గెలుపు సాధ్యమేనా?..ఉప ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో చేజారిన సీటు....గెలుపోటములను శాసించే స్థాయిలో కమ్యూనిస్టులు


Next Story

Most Viewed