రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాలు 5,774.. లెక్క తేల్చిన అధికారులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-15 01:53:03  IST  )

రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాల లెక్క తేలింది. మొత్తంగా 5,774 స్థానాలు ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేసింది.

రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాలు 5,774.. లెక్క తేల్చిన అధికారులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాల లెక్క తేలింది. మొత్తంగా 5,774 స్థానాలు ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేసింది. ఈనెల 12తో ఎంపీటీసీ స్థానాల పునర్విభజన పూర్తయింది. దీంతో స్థానాలపై స్పష్టత వచ్చింది. గత మార్చిలో 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 5,774కు తగ్గింది. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పలు గ్రామాలు విలీనం కావడం, ఓఆర్ఆర్‌లోని గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయడమే ఇందుకు కారణం.

ఒక మండలంలో ఐదు స్థానాలు..

కొన్ని మండలాల్లో జనాభా ప్రకారం రెండు, మూడు ఎంపీటీసీ స్థానాలే ఉండటంతో ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఒక మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీల స్థానాలు ఉండే విధంగా మార్పులు చేసింది. వాస్తవానికి ఒక ఎంపీటీసీ స్థానానికి 3,500 జనాభా ఉండాలి. ఎంపీపీ, వైస్​ఎంపీపీలకు ఇద్దరు ఎంపీటీసీ కావాలి. వారిని ఎన్నుకోవడానికి, వారు వేదిక మీద కూర్చుంటే సమావేశానికి హాజరుకావడానికి కనీసం మరో ఎంపీటీసీ అయినా ఉండాలి. కానీ పలు గ్రామాల్లో ఆ పరిస్థితులు లేకపోవడంతో ప్రతి మండలంలో కనీసం ఐదుగురు ఎంపీటీసీలు ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో అనేక మండలాల్లో ఐదు ఎంపీటీసీలు స్థానాలు ఏర్పడ్డాయి.

విలీనమే సంఖ్య తగ్గడానికి కారణం

రాష్ట్రంలో గత మార్చి తర్వాత కొత్తగా మున్సిపాలిటీలు, మున్సిపల్​కార్పొరేషన్‌లు ఏర్పడటంతో సమీప గ్రామాలను అందులో కలిపారు. ఓఆర్ఆర్ లోపలి గ్రామాలను సైతం సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. దీంతో ఎంపీటీసీ స్థానాలు సంఖ్య తగ్గింది. గత మార్చిలో 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 5,774కు తగ్గింది. మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లాలో 19 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఆ జిల్లాను అర్బన్​జిల్లా మార్చారు. దీంతో ఆ 19 స్థానాలు కనుమరుగైపోయాయి. ఖమ్మం, నారాయణ‌పేట్, నాగర్‌ కర్నూలు, కొత్తగూడెం జిల్లాల్లో నాలుగు చొప్పున, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో మూడు చొప్పున, రంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలో ఒకటి చొప్పున ఎంపీటీసీ స్థానాలు పట్టణ స్థానిక సంస్థల్లో వీలినమయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 352 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. అత్యల్పంగా ములుగు జిల్లాలో 84 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.

ఇప్పటికే ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలపై స్పష్టత

ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల లెక్క తేలింది. రాష్ట్రంలో 566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉన్నట్టుగా అధికారులు తేల్చారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు మొదటి దశ కసరత్తు దాదాపుగా పూర్తయింది. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వగానే వాటిని పంచాయతీరాజ్​శాఖ ఖరారు చేయనుంది. అనంతరం ఆ వివరాలను ఎన్నికల కమిషన్‌కు అందించనుంది. దీంతో ప్రభుత్వం వైపు నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. ఆ తర్వాత ఎన్నికలకు కమిషన్ ఏర్పాటు చేయనుంది.

జిల్లా - ఎంపీటీసీ స్థానాలు

-------------------------------------------------

ఆదిలాబాద్​ - 166

అసిఫాబాద్​ - 127

మంచిర్యాల - 129

నిర్మల్ - 157

కరీంనగర్ - 170

జగిత్యాల - 216

సిరిసిల్ల -123

పెద్దపల్లి -139

నిజామాబాద్​ - 307

కామారెడ్డి - 237

సిద్దిపేట - 230

సంగారెడ్డి - 273

మెదక్​ - 190

రంగారెడ్డి - 231

వికారాబాద్​ - 227

మహబూబ్‌నగర్​ - 175

నారాయణపేట్​ - 132

నాగర్‌కర్నూలు - 210

గద్వాల - 142

వనపర్తి - 133

సూర్యాపేట - 235

నల్లగొండ - 352

భువనగిరి - 178

వరంగల్ - 130

హన్మకొండ- 129

ములుగు - 84

మహబూబాబాద్ ​-193

భూపాలపల్లి - 109

జనగామ - 134

ఖమ్మం - 288

కొత్తగూడెం - 232

------------------------------

మొత్తం - 5,744

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌------------------------------

Next Story