బీఆర్ఎస్ నాయకుడితో ప్రాణ హాని ఉందంటూ యువకుడి నిరసన

by Disha Web Desk 4 |
బీఆర్ఎస్ నాయకుడితో ప్రాణ హాని ఉందంటూ యువకుడి నిరసన
X

దిశ, కామారెడ్డి రూరల్ : మద్నూర్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్‌తో తనకు ప్రాణహాని ఉందని యువకుడు తెలిపాడు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట సోమవారం మద్నూర్‌కు చెందిన సిద్ధప్ప అనే యువకుడు నిరసనకు దిగాడు. ఇటీవల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు రక్షించి తనకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కరించలేదన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా మద్నూర్ మార్కెట్ కమిటీ అవినీతి వివరాలు అడగడంతో వారు ఇవ్వలేదన్నారు.

దీంతో రాష్ట్ర సమాచార హక్కు చట్టం కార్యాలయంలో దరఖాస్తు చేయడం జరిగిందన్నారు. అక్కడ కూడా న్యాయం జరగకపోవడంతో ఢిల్లీలోని కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ కార్యాలయం ముందు దరఖాస్తు చేసి నిరసన తెలిపినట్లు పేర్కొన్నారు. అక్కడ కొన్ని ఆధారాలు ఇస్తున్నామని చెప్పి చేతులు దులుపుకున్నారన్నారు. ఈ విషయమై తనను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది చంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని గత ఎనిమిది నెలల నుంచి గ్రామంలోకి వెళ్లకుండా బయటనే తల దాచుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తనకు రక్షణ కల్పించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.


Next Story

Most Viewed