పేకాట ఆడేందుకు వెళ్లిన యువకుడు..

by Disha Web Desk 4 |
పేకాట ఆడేందుకు వెళ్లిన యువకుడు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పేకాట ఆడేందుకు నలుగురు స్నేహితులతో వెళ్లిన యువకుడు హత్యకు గురయ్యాడు. ఆదివారం తన స్నేహితులతో జూదం ఆడేందుకు వెళ్లిన యువకుడు రాత్రి తిరిగి రాకపోవడంతో గాలించిన కుటుంబ సభ్యులకు అతడు హత్యకు గురయ్యారని తెలపడం వారి కుటుంబంలో విషాదం నింపింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని తీర్మన్ పల్లి గ్రామానికి చెందిన నబి సాబ్ అలియాస్ అక్బర్( 35) ఆదివారం ఉదయం ఇంటి నుండి వెళ్లి రాత్రివేళ తిరిగి రాలేదు.

సోమవారం ఉదయం తిర్మన్ పల్లి శివారులో నబీ సాబ్ అలియాస్ అక్బర్ డెడ్ బాడీని మార్నింగ్ వాకింగ్‌కు వచ్చిన వారు గుర్తించి సమాచారం అందించారు. ఇందల్వాయి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నబి సాబ్ భార్య హమ్రిన్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తన భర్త నబీ సాబ్‌కు ఫోన్ చేశానని తెలిపారు. ఆ సమయంలో తాను పనిమీద ఉన్నానంటూ భార్యకు తెలిపారన్నారు. అనంతరం రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలలో వెతికామని తెలిపారు.

అప్పటికి నబిసాబ్ ఆచూకీ తెలియక పోవడంతో సోమవారం ఉదయం వాకింగ్ చేసే కొందరు కోళ్ల ఫారం వద్ద చెప్పులు, ఫోను, మృతదేహాం కనిపించడంతో నబి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతునికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడిని కొట్టి చంపినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతుని హత్య వెనక జూదం ఆడిన వారు ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎలాగైనా హంతకులను పట్టుకొని తమ కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. సిమెంట్ బస్తాల హమాలి పని చేసే నబీ సాబ్‌కు కొందరు కామారెడ్డికి చెందిన మిత్రులు ఉన్నట్లు తెలిసింది. వారే హత్య చేశారని అతని భార్య ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.

Next Story

Most Viewed