ఏపీలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ వేదిక ఖరారు?

by Disha Web Desk 2 |
ఏపీలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ వేదిక ఖరారు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీలో పట్టుకోసం బీఆర్ఎస్ రెడీ అయితున్నది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎజెండాతో అడుగుపెట్టేందుకు ప్లాన్ చేస్తు్న్నది. ఈనెల మూడోవారంలో భారీ సభ ఏర్పాటు సన్నాహాల్లో నిమగ్నమైనది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మిక సంఘాల నిరసనలకు సంఘీభావం తెలపాలని పార్టీ ఏపీ కమిటీని అధిష్టానం ఆదేశించినది. ప్రజలను సమీకరించే పనిలో అక్కడి నేతలు తలమునకలయ్యారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్ ఇప్పటిదాకా ఏపీకి వెళ్లలేదు. గత జనవరి 2న ఏపీకి చెందిన సీనియర్ నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఆ రాష్ట్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు ప్రచారం జరిగినప్పటికీ నిర్వహించలేదు. అక్కడ గులాబీ బాస్ అడుగుపెట్టలేదు. కేవలం మహారాష్ట్ర పైనే ఫోకస్ పెట్టారు. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయాలనే కుట్ర జరుగుతుందని, కేంద్రం రాయితీలు ఇవ్వడం లేదని కార్మికులు, కార్మికసంఘాలు నిరసనలకు దిగాయి. దీంతో ఏపీలో గ్రాండ్ గా అడుగుపెట్టేందుకు కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈనెల 27న ఉండడంతో అంతకు ముందే నిర్వహించి రెండు తెలుగురాష్ట్రాల్లోని ప్రజల్లో భరోసా, పార్టీ కేడర్ లో జోష్ నింపాలని భావిస్తున్నట్లు సమాచారం.

స్టీల్ ప్లాంట్ అంశంతో ఎంట్రీ

వర్కింగ్ కాపిటల్, ముడి సరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు కేంద్రం కొత్త కుట్ర చేస్తుందని, దానిని మానుకోవాలని తాజాగా మంత్రి కేటీఆర్ కేంద్రానికి బహిరంగలేఖ రాశారు. మోడీ తన కార్పొరేట్ మిత్రులకు 12.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ఇదే ఔదార్యం ఎందుకు లేదని ప్రశ్నించారు. రూ. లక్షన్నర కోట్ల విలువ కలిగిన స్టీల్ ప్లాంట్ ను అప్పనంగా ప్రవేట్ పరం చేసే కుట్రలను కేంద్రం ఆపాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టంచేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మిక సంఘాలను కలిపి మద్దతు తెలపాలని ఏపీ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ను అధిష్టానం ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తుంగా ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్ఆర్సీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరింది. ఇదే అదునుగా భావించి స్టీల్ ప్లాంట్ ను అవకాశంగా తీసుకుని ఎంట్రీ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే భారీ సభ పెట్టి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలు, పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాలపైనా వివరించి ఆకర్షించే ప్లాన్ కు మ్యాప్ రెడీ చేసినట్టు సమాచారం.

సర్కార్ వ్యతిరేక ఓటు పడేలా..

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అన్నిపార్టీలు యాక్టీవ్ అయ్యాయి. జగన్ సర్కార్ పై అసంతృప్తి స్టార్ట్ అయింది. అయితే.. ఇప్పటివరకు జగన్ తో కేసీఆర్ ఫ్రెండ్ షిప్ కొనసాగుతుండగా కొంత వెనకాముందు ఆలోచించినట్లు తెలిసింది. అయితే అక్కడి ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని టీడీపీకి లాభం చేకూరుతుందని దానికి అడ్డుకట్ట వేసేందుకే గులాబీ బాస్ అక్కడ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ కు పడేలా ప్లాన్ రూపొందిస్తున్నట్లు పార్టీవర్గాల టాక్. జగన్ కు లాభం చేసేందుకు స్టీల్ ప్లాంట్ ఉద్యమ కార్యాచరణకు కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారని విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే కేంద్రానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో లేఖ రాయించడం, ఏపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ను సైతం కార్మికులకు సంఘీభావం తెలిపాలని ఆదేశించారని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఇదే అదనుగా తీసుకొని కేసీఆర్ ఏపీలో పట్టుసాధించేందుకు స్కెచ్ వేస్తున్నట్లు తెలిసింది.

Also Read...

బిగ్ న్యూస్: ఏపీలో ఎంట్రీకి KCR రెడీ.. త్వరలోనే అక్కడ భారీ బహిరంగ సభకు ప్లాన్..?!


Next Story

Most Viewed