నాకు రెండు ఓట్లు లేవు.. తప్పుడు ఫిర్యాదులు చేస్తే చర్యలు తప్పవు: సీఎం రేవంత్ రెడ్డి

by Ramesh Naini |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటర్ల జాబితా ప్రక్షాళనతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫామ్‌ల పంపిణీపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

నాకు రెండు ఓట్లు లేవు.. తప్పుడు ఫిర్యాదులు చేస్తే చర్యలు తప్పవు: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటర్ల జాబితా ప్రక్షాళనతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫామ్‌ల పంపిణీపై కీలక ఆదేశాలు జారీ చేశారు. తనకు రెండు ఓట్లు ఉన్నాయన్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన.. విద్యార్థుల యూనిఫామ్‌ల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఓటు పోతే పథకాలు ఆగినట్టే..

మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తనకు రెండు ఓట్లు లేవని, తన ఓటును కొడంగల్‌కు మార్చుకున్నానని క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా దీనిపై ఫిర్యాదు చేస్తే విచారణ చేయిస్తానని, ఒకవేళ ఆ ఫిర్యాదు అబద్ధమని తేలితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే, ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోయే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉండేలా చూసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలతో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల జాబితా ప్రక్రియను పర్యవేక్షించాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఆగస్టు 15 కల్లా విద్యార్థులకు యూనిఫామ్‌లు..

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్‌లపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. దుస్తుల పంపిణీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంస్థలపై ఒత్తిడి తెచ్చి ఆగస్టు 15 నాటికి విద్యార్థులకు యూనిఫామ్‌లు అందించాలి. పంపిణీ తర్వాత ప్రతి విద్యార్థి నుంచి కచ్చితంగా అభిప్రాయాలు (ఫీడ్‌బ్యాక్) సేకరించాలి. వాటి ఆధారంగానే వచ్చే ఏడాది దుస్తుల పంపిణీ జరగాలి. గత ప్రభుత్వం ఈ విషయంలో అడ్డగోలుగా వ్యవహరించింది. అధికారులు మాత్రం పేద పిల్లల కోసం పనిచేస్తున్నామన్న సేవా దృక్పథంతో బాధ్యతగా మెలగాలి. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్‌ 2 నాటికే విద్యార్థులకు యూనిఫామ్‌లు అందేలా పక్కా కార్యాచరణ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Next Story