TRS సర్కార్ కీలక నిర్ణయం.. దానికోసం వందల కోట్లను ఖర్చు పెట్టాలని ప్లాన్!

by Disha Web Desk 2 |
TRS సర్కార్ కీలక నిర్ణయం.. దానికోసం వందల కోట్లను ఖర్చు పెట్టాలని ప్లాన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మోడల్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని భావిస్తున్న టీఆర్ఎస్ ఇప్పుడు ప్రభుత్వపరంగా హైదరాబాద్ నగరానికి వచ్చిన అవార్డును దేశ విదేశాల్లో గొప్పగా ప్రచారం చేయాలనే ప్లాన్ సిద్ధమవుతున్నది. ఇందుకోసం సుమారు రూ.300 కోట్లను ఖర్చు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. ఈ ఏడాది జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున జాతీయ హిందీ, ఇంగ్లీషు, వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పత్రికలకు భారీ స్థాయిలో అడ్వర్టయిజ్‌మెంట్లను ఇచ్చినట్లుగానే ఇప్పుడు అంతర్జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా విదేశాల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచాలనే నిర్ణయం తీసుకున్నట్లు అధికారుల సమాచారం.

ఢిల్లీలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్నే ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌తో చర్చించినట్లు తెలిసింది. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ కూడా అయినందున ఇంటర్నేషనల్ మీడియాలో హైదరాబాద్ నగర ఖ్యాతిని విస్తృతంగా పబ్లిసిటీ లభించేలా ఏజెన్సీలను ఫైనల్ చేసే బాధ్యతను అప్పజెప్పినట్లు తెలిసింది. ఇంటర్నేషనల్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ 2022 సంవత్సరానికి 'గ్రీన్' పేరుతో వివిధ అంశాలను అధ్యయనం చేసి హైదరాబాద్ నగరానికి ఒక విభాగంలో గ్రీన్ విన్నర్‌గా, మరో విభాగంలో గ్రాండ్ విన్నర్‌గా ఎంపిక చేసింది. ఇటీవలే అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డు లభించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులను, అధికారులను ఇటీవల అభినందించారు.

ఇప్పుడు అభినందనలతోనే సరిపెట్టుకోకుండా ఈ గుర్తింపును విశ్వవ్యాప్తం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. త్వరలోనే రాయిటర్స్, న్యూయార్క్ టైమ్స్, ట్రిబ్యూన్, వాషింగ్టన్ టైమ్స్, ఏపీ, ఏఎఫ్‌పీ, వాల్ స్ట్రీట్ జర్నల్, బీబీసీ తదితర ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో విశేష స్థాయిలో ప్రాచుర్యం లభించేలా వ్యూహం ఖరారు చేస్తున్నది. ఖర్చుకు వెనకాడాల్సిన అవసరం లేదని అధికారులకు సీఎం భరోసా ఇచ్చినట్లు తెలిసింది. సందర్భానుసారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ రాష్ట్రం గురించి తెలియజేసేలా ఇతర రాష్ట్రాల్లో భారీ స్థాయిలో యాడ్‌లు ఇచ్చినట్లుగానే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి హైదరాబాద్ ఇమేజ్‌ను తీసుకెళ్ళే ప్లాన్ దాదాపుగా ఖరారైంది.


Next Story

Most Viewed