ఈ నెల 9 నుంచి 14వరకు నిరసనలు.. తెలంగాణ గిరిజన సంఘం

by Dishafeatures2 |
ఈ నెల 9 నుంచి 14వరకు నిరసనలు.. తెలంగాణ గిరిజన సంఘం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రం అనుసరిస్తున్న గిరిజనుల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9 నుంచి 14 వరకు నిరసనలు చేపడుతున్నట్లు తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎం. ధర్మ నాయక్ ,ఆర్. శ్రీరాం నాయక్ తెలిపారు. గిరిజన తెగల మధ్య ఘర్షణ పెడుతున్న బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా పోరాడుదాం- గిరిజన హక్కులను కాపాడుకుందాం, మణిపూర్ లో గిరిజన తెగలను రక్షించండి అనే నినాదాలతో ముద్రించిన వాల్ పోస్టర్ ను సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాల వలన గిరిజనులకు కల్పించిన రాజ్యాంగ హక్కులను పూర్తిగా కాలరాస్తోందని ఆరోపించారు.

ఒకవైపు గిరిజన తెగల మధ్య ఘర్షణలు రేపుతూనే మరోవైపు వాల్మీకి బోయ వంటి 11 ఓబీసీ కులాలను గిరిజన జాబితాలో కలిపేందుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పెసా వంటి చట్టాలతో పాటు సంస్కృతి, ఆచారాలను రద్దు చేయడానికే యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి చట్టం తీసుకొస్తుందని ఆరోపించారు. అడవులు, అటవీ సంపదను అంబానీ, ఆదాని లాంటి కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే ఈ పార్లమెంట్ సమావేశాల్లో అటవీ సంరక్షణ నియమాల బిల్లును చట్టంగా ఆమోదించిందని విమర్శించారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు గిరిజన బంధు అమలు చేస్తామని ప్రకటించి ఏడాది గడుస్తున్నా అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. పోడు భూముల పంపిణీలో హక్కుపత్రాలు రాని అర్హులైన గిరిజనులు అందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలని, సీఎం చెప్పిన విధంగా 11లక్షల ఎకరాలపై హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపి నాయక్, బాలు, పాండు, రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.




Next Story

Most Viewed