చత్తీస్‌ఘడ్, తెలంగాణ సరిహద్దుల్లో వైమానిక దాడి ఆపండి

by Dishafeatures2 |
చత్తీస్‌ఘడ్, తెలంగాణ సరిహద్దుల్లో వైమానిక దాడి ఆపండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: చత్తీస్‌ఘడ్, తెలంగాణ సరిహద్దుల్లో ఆదివాసీ గ్రామాలపై జరుపుతున్న వైమానిక యుద్దాన్ని నిలిపివేయాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. దేశ ప్రజలపై డ్రోన్ ఏరియల్ బాంబింగ్ అంటే మారణ హోమమే అని గురువారం సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. సరిహద్దుల్లోని ఆదివాసీ గ్రామాల్లో వైమానిక దాడులు చేయడం వల్ల గిరిజనులు, రైతులు భయబ్రాంతులకు గురవుతున్నారని, ఒక ఆదివాసీ మహిళ చనిపోవడం జరిగిందని తెలిపారు. వరుసగా రెండేళ్లుగా డ్రోన్లతో బాంబు దాడులు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఇవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీల్లో భాగమైన అదానీ, అంబాని, జిందాల్ లాంటి లాయిడ్స్ కంపెనీల కోసమే ఆదివాసీలపై యుద్దకాండను కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

ఎస్పీ సుందర్ రాజన్ చెబుతున్నవన్నీ కూడా అబద్దాలేనని విమర్శించారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలెవరైనా నేరానికి పాల్పడితే న్యాయస్థానాల ద్వారా శిక్షించే స్థితి ఉండాలని, చంపివేసే అధికారం ఎవరికీ లేదన్నారు. చత్తీస్‌ఘడ్‌లో ఇప్పటికే ఉన్న 100కు పైగా ఉన్న సెక్యూరిటీ క్యాంపులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సిలింగేర్ ప్రాంతంలో 500 రోజులకు పైబడి శాంతియుతంగా సిలింగేర్ సెక్యూరిటీ క్యాంపులకు వ్యతిరేకంగా ఆదివాసీలు చేస్తున్న ఆందోళనకు పరిష్కారంగా వెంటనే సిలింగర్ క్యాంపును ఎత్తి వేయాలన్నారు. 2004లో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్‌ఆర్ శంకరన్ ఆధ్వర్యంలో ఎలాగైతే హైదరాబాద్‌లో శాంతి చర్చలు జరిగాయో, మళ్ళీ అటువంటి ప్రాతిపదిక కొనసాగాల్సిందిగా డిమాండ్ చేశారు. ఆపరేషన్ సమాధాన్, ప్రహార్‌లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దాడులను అందరూ వ్యతిరేకించి మూలవాసీల జీవించే హక్కుకై నిలబడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed