ఈసారి గ్రాండ్‌గా అంబేద్కర్ జయంతి.. ఊహించని రేంజ్‌లో ప్లాన్!

by Disha Web Desk 2 |
ఈసారి గ్రాండ్‌గా అంబేద్కర్ జయంతి.. ఊహించని రేంజ్‌లో ప్లాన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఘనంగా నిర్వహించాలనుకుంటున్నది. అన్ని జిల్లాల్లోనూ గ్రాండ్‌గా ప్రభుత్వ ఖర్చుతో చేసేలా ప్లాన్ చేస్తున్నది. అన్ని జిల్లా కేంద్రాల్లో బహిరంగసభలను నిర్వహించాలనుకుంటున్నది. ‘దళితబంధు’ స్కీమ్‌తో ఆ సెక్షన్ ప్రజలకు చేరువయ్యే వ్యూహం ఇప్పటికే అమలవుతున్నది. దానికి కొనసాగింపుగా ఈసారి అంబేద్కర్ జయంతిని కూడా ఘనంగానే జరపాలని డిసైడ్ చేసింది. అదే రోజున ట్యాంక్‌బండ్ సమీపంలో నిర్మిస్తున్న 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించేలా ముసాయిదా షెడ్యూలు రూపొందింది. దానికి అనుగుణంగా రాత్రింబవళ్లు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

అంబేద్కర్ జయంతి రోజున జిల్లాల్లో జరిగే బహిరంగసభలకు కొనసాగింపుగా ఏప్రిల్ నెల చివర్లో వరంగల్ శివారులో లక్షలాది మంది హాజరయ్యేలా భారీ బహిరంగ సభ గురించి కూడా పార్టీ అగ్రనేతల మధ్య చర్చ జరుగుతున్నది. తగిన గ్రౌండ్‌ను చూసి వీలైనంత తొందరగా ఒక నిర్ణయం తీసుకునేలా జిల్లా నేతలకు ఆదేశాలు వెళ్ళాయి. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఎన్నికల ప్రచారానికి ఈ బహిరంగసభతోనే శ్రీకారం చుట్టాలనుకుంటున్నది. ఆ తర్వాత నుంచి అన్ని జిల్లాల్లో ఎన్నికల సభలు జరగనున్నాయి. మంత్రులంతా ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలకు ప్లాన్ చేసుకుంటారు. ప్రతీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ జిల్లాను ఎంచుకోవడం ఆనవాయితీ అయినప్పటికీ ఈసారి వరంగల్ జిల్లాపై దృష్టి పెట్టడానికి నిర్దిష్ట కారణాలు ఉన్నాయి.

వరంగల్ జిల్లాలో ఈసారి ప్రత్యర్థి పార్టీల బలం కాస్త పెరిగిందనే అంచనాకు అనుగుణంగా భారీ బహిరంగ సభకు ఈ జిల్లాను వేదికగా చేసుకున్నట్లు సమాచారం. అన్ని జిల్లాల నుంచి ఇక్కడకు తరలించి లక్షలాది మంది హాజరయ్యారనే సందేశాన్ని పంపాలనుకుంటున్నది. ఈ బహిరంగసభకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాల నుంచి సమాచారం ఉన్నా నిర్దిష్టంగా ఎవరెవరిపై దృష్టి పెట్టిందనేది వెల్లడించలేదు. సచివాలయం ఓపెనింగ్ కార్యక్రమాన్ని తొలుత ఫిక్స్ చేసిన సందర్భంగా పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే పబ్లిక్ మీటింగ్‌కు తమిళనాడు, జార్ఖండ్, బిహార్ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ భావించారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా బహిరంగసభ ప్రోగ్రామ్‌ను వాయిదా వేశారు. ఏప్రిల్ చివర్లో వరంగల్‌లో జరిగే బహిరంగసభకు ఆహ్వానిస్తారా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

సచివాలయం ఓపెనింగ్‌పై సస్పెన్స్

అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) రోజునే కొత్త సచివాలయాన్ని కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ఎమ్మెల్సీ కవిత ఇటీవల ఓ జాతీయ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో పేర్కొన్నారు. కానీ అంబేద్కర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించాలనుకుంటున్నందున సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మరో రోజున పెట్టుకోవాలని భావిస్తున్నది. రెండు కార్యక్రమాల వేర్వేరుగా నిర్వహించడం ద్వారానే మైలేజ్ ఎక్కువగా ఉంటుందనే అంచనాకు వచ్చింది. వరంగల్ శివారు ప్రాంతంలో భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తున్నందున అది కలిసివచ్చేలా ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేసే అవకాశం ఉన్నది. అధికారి కార్యక్రమానికి పలు పార్టీల అధినేతలను, రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించి అదేరోజున బహిరంగసభకు కూడా హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నది.

ఇవి కూడా చదవండి: BRS ఆవిర్భావ సభకు బ్రేక్.. ఏప్రిల్ 27 ఇక చరిత్రకే పరిమితమా?

Next Story

Most Viewed