ప్రవీణ్ ​ఒక్కడే కాదు.. మరో 8 మంది పరీక్షలు రాశారు

by Dishafeatures2 |
ప్రవీణ్ ​ఒక్కడే కాదు.. మరో 8 మంది పరీక్షలు రాశారు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితుల పోలీస్ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో సిట్​అధికారులు విచారణను మరింత ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ బోర్డులో పని చేస్తున్న మరో ఎనిమిది మంది కూడా గ్రూప్​1తోపాటు వేర్వేరు పరీక్షలు రాసినట్టు గుర్తించారు. ఈ ఇద్దరితోపాటు బోర్డులో పనిచేస్తున్న మొత్తం నలభై రెండు మంది ఉద్యోగులకు కూడా నోటీసులు జారీ చేసిన వీరిని క్షుణ్నంగా విచారించాలని నిర్ణయించారు. ఇక, ఈ కేసులో నిందితురాలిగా ఉన్న రేణుకకు కొన్ని కోచింగ్​సెంటర్ల నిర్వాహకులతో సంబంధాలు ఉన్నట్టుగా వెల్లడైన క్రమంలో ఆ దిశగా కూడా సిట్​అధికారులు దృష్టి సారించారు. రాజశేఖర్​రెడ్డిని ప్రభుత్వ శాఖలో ఔట్​సోర్సింగ్​ఉద్యోగిగా నియమించిన ప్రైవేట్​ఏజన్సీ నిర్వాహకులను కూడా సిట్​అధికారులు ప్రశ్నించనున్నట్టు తెలిసింది. బోర్డులోని కాన్ఫిడెన్షియల్​రూం ఇంఛార్జీగా ఉన్న శంకర్​లక్ష్మి వాంగ్మూలాన్ని గురువారం మరోసారి రికార్డు చేయాలని నిర్ణయించారు. ఈ పరిణామాలు బోర్డు ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.

ఒక్కడే కాదు..

ఇంతకు ముందు జరిపిన విచారణలో బోర్డు ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రవీణ్​గ్రూప్​1 ప్రిలిమ్స్​పరీక్ష రాసినట్టుగా వెల్లడైన విషయం తెలిసిందే. అయితే, తాజాగా జరిపిన దర్యాప్తులో ఒక్క ప్రవీణే కాకుండా బోర్డులో పనిచేస్తున్న మరో ఎనిమిది మంది కూడా గ్రూప్​1ప్రిలిమ్స్​తోపాటు వేర్వేరు పరీక్షలు రాసినట్టుగా సిట్​దర్యాప్తులో వెల్లడైనట్టు తెలిసింది. దాంతో ఈ ఎనిమిది మందిని కూడా నిశితంగా విచారించాలని సిట్​అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే వీరికి నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని సూచించారు. ఆయా పరీక్షల్లో ఈ ఎనిమిది మందికి ఎన్నెన్ని మార్కులు వచ్చాయి?..డ్యూటీలో ఉండే పరీక్షలు రాశారా?..నిబంధనల ప్రకారం సెలవులపై వెళ్లి పరీక్షలు రాశారా?..లీకైన ప్రశ్నాపత్రాలు వీరిలో ఎవరి చేతికైనా అందాయా?..అందితే ఎవరి నుంచి? అన్న అంశాలపై వీరిని ప్రశ్నించనున్నట్టు తెలిసింది.

మొత్తం 42 మంది ఉద్యోగులకు నోటీసులు..

దాంతోపాటు బోర్డులో పనిచేస్తున్న మొత్తం నలభై రెండు మంది ఉద్యోగులను కూడా ప్రశ్నించాలని సిట్​అధికారులు నిశ్చయించారు. వీరికి ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. లీకేజీ కేసులో మొదటి ఇద్దరు నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్​రెడ్డిలతో ఎవరెవరు సన్నిహితంగా ఉండేవారు?..లీకేజీలో ఇంకా ఎవరైనా వీరికి సహకరించారా? అన్నది నిగ్గు తేల్చటానికే వీరిని విచారణ జరపాలని సిట్​అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది.

సిట్​ ఆఫీస్​లో..

లీకేజీ కేసులో ఉన్న తొమ్మిది మంది నిందితులను ఆదివారం మరోసారి సిట్​కార్యాలయంలో విచారణ చేశారు. ప్రశ్నాపత్రాలను లీక్​చేసిన తీరు, వాటిని బయటి వ్యక్తులకు ఎలా అమ్మారు? అన్న విషయాలపై ప్రధానంగా వీరిని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో ఎంత డబ్బు చేతులు మారింది?, ఎవరెవరికి ఎన్ని డబ్బులు ముట్టాయి?, ఆ డబ్బును ఏం చేశారు? అన్న విషయాలపై వీరిని ప్రశ్నించినట్టు సమాచారం.

శంకర్​లక్ష్మిని రెండోసారి..

ఈ క్రమంలోనే బోర్డులోని కాన్ఫిడెన్షియల్​రూం ఇంఛార్జీగా ఉన్న శంకర్​లక్ష్మిని మరోసారి ప్రశ్నించాలని సిట్​అధికారులు నిర్ణయించారు. మంగళవారం రాత్రి శంకర్​లక్ష్మిని సిట్​కార్యాలయానికి పిలిపించి విచారించిన విషయం తెలిసిందే. తాజాగా తొమ్మిది మంది నిందితులను విచారించిన క్రమంలో వెల్లడైన వివరాల మేరకు గురువారం మరోసారి ఆమెను సిట్​ఆఫీస్​కు పిలిపించి వాంగ్మూలం రికార్డు చేయనున్నారు. కాన్ఫిడెన్షియల్​రూంలో ఉన్న కంప్యూటర్​కు సంబంధించిన డైనమిక్​ఐపీ అడ్రస్​తోపాటు పాస్​వర్దులను శంకర్​లక్ష్మి డైరీ నుంచే తస్కరించినట్టు ఇప్పటికే నిందితుడు ప్రవీణ్​విచారణలో వెల్లడించాడు. అయితే, తాను ఎక్కడా ఐపీ అడ్రసులు, పాస్​వర్డులను రాసి పెట్టలేదని శంకర్​లక్ష్మి చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో అసలు నిజమేమిటన్నది నిర్ధారించుకోవటానికే ఆమెను రెండోసారి ప్రశ్నించాలని సిట్​అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

కోచింగ్​సెంటర్ల నిర్వాహకులను సైతం..

లీకేజీ కేసులో మూడో నిందితురాలిగా ఉన్న రేణుకను విచారించినపుడు ఆమెకు కొన్ని కోచింగ్​సెంటర్ల నిర్వాహకులతో పరిచయాలు ఉన్నట్టుగా వెల్లడైందని సమాచారం. ఇప్పటికే సిట్​అధికారులు ఆ కోచింగ్​సెంటర్ల వివరాలను రేణుక నుంచి తీసుకున్నట్టు తెలిసింది. తాజాగా ఈ కోచింగ్​సెంటర్లను నడుపుతున్న వారిని కూడా పిలిపించి ప్రశ్నించాలని నిర్ణయించినట్టు తెలిసింది. వీరిలో ఎవరికైనా రేణుక ప్రశ్నాపత్రాలు ఇచ్చిందా?..ఇస్తే ఆయా సెంటర్ల నిర్వాహకులు ఎవరికైనా అమ్మారా? అన్న కోణాల్లో దర్యాప్తు చేయాలని సిట్​అధికారులు భావిస్తున్నారు.

ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితా..

ఇదిలా ఉండగా బోర్డు నిర్వహించిన గ్రూప్​1 ప్రిలిమ్స్​తోపాటు ఇతర పరీక్షల్లో అత్యధికంగా మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితాను సిట్​సిద్ధం చేసినట్టుగా తెలిసింది. వీళ్లందరిని కూడా సిట్​కార్యాలయానికి పిలిపించనున్నట్టు సమాచారం. పరీక్షల్లో అన్ని మార్కులు ఎలా సంపాదించారు?..లీకైన ప్రశ్నాపత్రాలను వీళ్లలో ఎవరైనా కొన్నారా?..కొంటే ఎవరి నుంచి? అన్న అంశాలపై వీరిని ప్రశ్నించనున్నారు.

రమేశ్​ పాత్ర ఏమిటి..?

ఇక, లీకేజీ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాజశేఖర్​రెడ్డి స్నేహితుడు రమేశ్​పాత్రపై కూడా సిట్​అధికారులు ఆరా తీస్తున్నారు. రాజశేఖర్​రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో రమేశ్​ ఒకడని సిట్​విచారణలో ఇప్పటికే తేలింది. ఈ క్రమంలో ప్రశ్నాపత్రాల అమ్మకంలో రమేశ్​అతనికి సహాయపడ్డాడా?..సహాయపడితే ఎలా సహాయపడ్డాడు?..ఎవరికైనా ప్రశ్నాపత్రాలు విక్రయించాడా?..విక్రయిస్తే కొన్నవాళ్లు ఎవరు? అన్న అంశాలపై అతని నుంచి వివరాలు సేకరించాలని సిట్​అధికారులు భావిస్తున్నారు. ఇక, రాజశేఖర్​రెడ్డిని ఔట్​సోర్సింగ్​ఉద్యోగిగా నియమించింది తెలంగాణ స్టేట్​టెక్నలాజికల్​సర్వీసెస్​అని ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి మీడియాతో చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆ సంస్థకు చెందిన నిర్వాహకులతో కూడా మాట్లాడాలని సిట్​అధికారులు భావిస్తున్నట్టుగా తెలియవచ్చింది.



Next Story

Most Viewed