- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Aadi Srinivas : ‘సారు రారు.. కారు రాదు’.. కేసీఆర్పై ఆది శ్రీనివాస్ సెటైర్లు
మా పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో రైతులు చల్లగా ఉంటే బీఆర్ఎస్ నేతలు చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మా పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో రైతులు చల్లగా ఉంటే బీఆర్ఎస్ నేతలు చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. మంగళవారం సీఎల్పీ మీడియా సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్లో రైతు సభ పెడతామని బీఆర్ఎస్ చెబుతోందని, ఎందుకు పార్టీ సభ పెడుతుందో సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ అంటే రైతు అని, రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అన్యాయం ఏమిటో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సంక్షేమ కార్యక్రమాలతో లబ్ది పొందుతున్న వారంతా మళ్లీ రేవంత్ రెడ్డినే అధికారంలోకి రావాలంటున్నారని, బీఆర్ఎస్ నాయకులు ఎన్ని వేషాలు వేసినా ఉపయోగం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమని, బీఆర్ఎస్ హయాంలో ధాన్యం కొనుగోళ్లు ఎలా జరిగాయో అందరికి తెలుసన్నారు. తాలు పేరుతో కిలోల కొద్ది తీశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం 8525 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 6005 కేంద్రాలు ఏర్పాటు చేశాం.. కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని ఆది శ్రీనివాస్ చెప్పారు. 7.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికే కొనుగోలు చేసి రైతులకు 277 కోట్ల రూపాయలను చెల్లించామని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందన్నారు.
కేసీఆర్కు కనిపించడం లేదా?
రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని, ఇవి కేసీఆర్కు కనిపించడం లేదా? కొనుగోలు సెంటర్లు లేవని, వడ్లు కొనుగోలు చేయడం లేదని రైతులు ఎక్కడైనా ఆందోళన చేస్తున్నారా? ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. నెలకు కేసీఆర్ హయాంలో రైతుల కోసం వెచ్చించిది రూ. 2532 కోట్లు మాత్రమే అని, తమ ప్రభుత్వం ప్రతి నెలా రైతుల కోసం రూ. 5452 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. ఇవి కాకి లెక్కలు కావని, ప్రభుత్వం అధికారంగా ఇచ్చిన గణంకాలని ఆది శ్రీనివాస్ చెప్పారు. రైతు భరోసా కింద ఈ సీజన్ లో ఇప్పటి వరకు రూ. 5,653 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని, మిగిలిన నిధులను కూడా త్వరలోనే ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నా భిన్నం అయిందని, లేకుంటే ఈసారి కూడా రైతు భరోసా సాయం వేగంగా అందించే వాళ్లమని ఆది శ్రీనివాస్ చెప్పారు. గత ఏడాది మార్చి, సెప్టెంబర్ లో వడగండ్లు, వర్షాలతో నష్టపోయిన 94,462 మంది రైతులకు రూ. 95.39 కోట్ల పరిహారం అందించిందని, ఇటీవల మార్చి, ఏప్రిల్ నెలల్లో వచ్చిన భారీ వర్షాలకు నష్టపోయిన 36, 449 మంది రైతులకు రూ. 44.19 కోట్ల పరిహారాన్ని ప్రజా ప్రభుత్వం అందించిందన్నారు.
కేంద్రం నుంచి సహకారం లేకపోయినా..
కేంద్రం నుంచి సహకారం లేకపోయినా రైతు పండించిన అన్ని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని, యూరియా కొరతపైన బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని, యూరియా కొరతకు కారణం కేంద్ర ప్రభుత్వమే అని ఆ పార్టీ వాళ్లకు తెలియదా? అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్త పార్టీకి స్పెస్ లేదని, ఇంట్లో గొడవల వల్లనే కవిత పార్టీ పెట్టిందన్నారు. పదేళ్ల పాపాపు పాలనలో భాగస్వామ్యం అయినందుకు క్షమాపణలు చెపుతానని కవితే చెప్పిందని, దయ్యాలు, పందికొక్కులను కేసీఆర్ పక్కన పెట్టుకున్నారని కవిత అంటోందని ఆది శ్రీనివాస్ చెప్పారు. సారు రారు.. కారు రాదని వాళ్ల కుటుంబ సభ్యులే చెపుతున్నారని, కల్వకుంట్ల కవిత ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పలేకపోతున్నారని ఆరోపించారు.






