పేదోడికి కోడి గుడ్డు ప్రియం

by Muthe.Rajitha |

తెలుగు రాష్ట్రాల్లో గుడ్డు ధరలు రికార్డు బద్దలు కొట్టాయి. రిటైల్​మార్కెట్​లో ఒక గుడ్డు ధర రూ. 8.50 చేరింది.

పేదోడికి కోడి గుడ్డు ప్రియం
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో గుడ్డు ధరలు రికార్డు బద్దలు కొట్టాయి. రిటైల్​మార్కెట్​లో ఒక గుడ్డు ధర రూ. 8.50 చేరింది. వైద్యులు ఎన్నో పోషకాలు ఉండే గుడ్డు రోజుకోటి తినాలని సూచిస్తే పేద, మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో గుడ్డు లేదు. గత నెలలో పది రోజుల కితం 30 గుడ్ల కేస్ ధర రూ.180 ఉండగా, తాజాగా రూ.240కి పెరిగింది. వారం, పది రోజులుగా రోజుకో విధంగా గుడ్డ ధరలు ఉంటున్నాయి. ఒకసారి కొనుగోలు చేసి ఐదారు రోజుల తరువాత తీసుకుద్దామని దుకాణాల వద్దకు వెళ్లితే ఊహించని ధరలు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో పేదలు కొద్ది రోజులు గుడ్డు తినేందుకు దూరంగా ఉండేందుకు సిద్దమైయ్యారు.

నార్త్​ఇండియాకు పెరిగిన ఎగుమతులు, మొంథా తుఫాన్​కారణంగా జరిగిన నష్టమే అధిక ధరలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అధిక ధరతో మధ్యాహ్న భోజనం, ఇతర ప్రభుత్వ హాస్టళ్లలో గుడ్డు వడ్డించడం నిర్వాహ కులకు ఆర్థిక భారం పడుతోంది. గ్రామీణ, మారు మూల ప్రాంతాల్లోని కొన్ని దుకాణాల్లో మాత్రం విని యోగదారులకు రూ.9 చొప్పున అమ్మకాలు చేసి జేబులు నింపుకుంటారనే విమర్శలు ఉన్నాయి. కార్తీక మాసంలో ఉపవాసం జనం ముగిసిన తరువాత ఎక్కువ సంఖ్యలో వినియోగించడంతో ధరలు అమాంతం పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

తగ్గిన ఉత్పత్తి కొండెక్కిన కోడిగుడ్డు :

సాధార ణంగా ప్రతి సంవత్సరం కోళ్ల ఫారాల్లో చలి పెరగడంతో గుడ్ల ఉత్పత్తి 50 శాతానికి పడిపోతుంది. దీంతో పాటు గత సీజన్లో ఫారాల్లో ఉన్న కోళ్ల బ్యాచ్​ల ను చాలామంది నిర్వాహకులు తొలగించడంతో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని వ్యాపారులు వెల్లడించారు. ఫామ్లలో కోళ్లు లేక, ఉన్నచోట చలికారణంగా గుడ్ల ఉత్పత్తి బాగా తగ్గింది. దీంతో సాధారణ డిమాండ్​కు అనుగుణంగా కోడిగుడ్ల సప్లయ్ లేక ధర అమాంతం పెరిగినట్లు కోళ్ల పామ్​నిర్వహకులు చెప్పారు. వచ్చే నెలలో క్రిసమస్, జనవరి నూతన సంవత్సరం వేడుకల కోసం కేకుల తయారీ కోసం కోడిగుడ్లను అధికంగా వినియోగిస్తారు. ఈ కారణంతో గుడ్డు ధర రూ. 10 దాటవచ్చని పౌల్ర్టీ పామ్​నిర్వహకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సామాన్యులపై మోయలేని భారం :

ఒక కోడిగుడ్డు ధర రూ. 8లు దాటడంతో చిన్న హోటళ్ల నుంచి ఇళ్ల వరకు అందరికీ రోజు వారి ఖర్చు పెరుగుతోంది. ఒక కుటుంబం రోజుకు 4 గుడ్లు వినియోగించినా నెలకు రూ.1050 లకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. చాలా మంది గుడ్ల వినియోగం తగ్గించడం తప్ప వేరే మార్గం లేదు. పిల్లల ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్ అందకపోవడం ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు సాధారణ ప్రజలు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. గుడ్డు వంటి సాధారణ పోషకాహార పదార్థం కూడా మామూలు మనుషుల అందుబాటులో లేకపోవడం ఒక బాధకరమని, ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెరిగిన ఈ సమయంలో ప్రభుత్వం, సంబంధిత వ్యవస్థలు జోక్యం చేసుకొని గుడ్ల ధరలను నియంత్రించాలని కోరుతున్నారు.

Next Story