'విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పించడమే ఏకైక లక్ష్యం'

by Disha Web Desk 13 |
విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పించడమే ఏకైక లక్ష్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర గురుకులాల ప్రిన్సిపల్స్ సంఘం ఆవిర్భవించింది. రాష్ట్రంలో ఉన్న 1,062 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకుల పాఠశాలలకు చెందిన ప్రిన్సిపల్స్ హైదరాబాద్ లో ఆదివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి నూతనంగా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం గౌరవ సలహాదారుడిగా బోయినపల్లి వినోద్ కుమార్ ఎన్నికయ్యారు. అనంతరం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్ తో గురుకుల ప్రిన్సిపల్స్ సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులకు బంగారు భవిష్యత్తును కల్పించడమే ఏకైక లక్ష్యంగా కృషి చేస్తామన్నారు.

కే.జీ. టు పీ.జీ. వరకు నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలన్న సీఎం లక్ష్యాన్ని సాధించేందుకు బాధ్యతలను చిత్తశుద్దితో నెరవేరుస్తామన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా రాష్ట్ర ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బోయినపల్లి మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్స్ అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్స్ సంఘం నూతన అధ్యక్షుడు డాక్టర్ ఆర్. అజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రాంబాబు, సంయుక్త కార్యదర్శి పోరండ్ల చంద్ర మోహన్, కోశాధికారి రాజేశం, మహిళా కార్యదర్శి నీలిమా దేవి, గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జి విద్యా సాగర్, వరంగల్ గ్రేటర్ ఆన్చార్జి టీ. శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed