రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు..శ్వాసకోశ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు!

by Disha Web Desk 2 |
రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు..శ్వాసకోశ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా శ్వాస సమస్యల బాధితుల సంఖ్య పెరుగుతున్నది. ఈ ఏడాది ఇప్పటికే 31,059 ఏఆర్ఐ, ఐఎల్ఐ (శ్వాసకోశ సమస్యలు) కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల్లో మార్పు రావడంతో ప్లూ ఇన్ఫెక్షన్లు ప్రబలుతున్నాయి. వీరిలో 85 శాతం మంది ఇప్పటికే కోలుకున్నారు. మిగతా వాళ్లకి చికిత్స కొనసాగుతున్నది. ప్రస్తుతం సీరియస్ పరిస్థితులెవ్వరికీ లేవని వైద్యాధికారులు పేర్కొన్నారు. 2020లో 18,425 మంది వివిధ రకాల శ్వాస సంబంధిత సమస్యలతో వైద్యం పొందగా, 2021లో 22,301 మంది ట్రీట్మెంట్ తీసుకున్నారు.

ఇక 2022లో అత్యధికంగా 52,132 మంది కి ప్లూ జాతికి చెందిన వైరస్ లు అటాక్ చేశాయి. అంటే 2021తో పోల్చితే 2022లో రెట్టింపు స్థాయిలో బాధితులు తేలారు. మరోవైపు ఈ ఏడాది ఇప్పటికే 31 వేల కు పైగా రెస్పిరెటరీ కేసులు తేలడం ప్రజలతోపాటు వైద్యారోగ్యశాఖను ఆందోళనకు గురి చేస్తున్నది. డైలీ తీవ్రమైన దగ్గు, బ్రీతింగ్ ప్రాబ్లమ్ సమస్యల బాధితులు పెరుగుతుండటంతో అన్ని ఆస్పత్రులను వైద్యారోగ్యశాఖ అలర్ట్ చేసింది. శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్న బాధితులను సపరేట్ గా వైద్యం అందించాలని సూచించింది. సపరేట్ వైద్యానికి సౌకర్యాలను కూడా సమకూర్చుకోవాలని ఆదేశాలిచ్చింది. దీంతో పాటు అవసరమైన డాక్టర్లు, స్టాఫ్ను అదనంగా చేర్చుకోవాలని సూచించింది.

గతేడాది ఆగస్టు నుంచి స్వైన్ ప్లూ..

గడిచిన మూడేళ్ల నుంచి పూర్తి కంట్రోల్ లో ఉన్న స్వైన్ ఫ్లూ 2022 ఆగస్టు నుంచి మళ్లీ వ్యాప్తి చెందుతున్నది. 2022 ఆగస్టులో 285, సెప్టెంబరులో 340, అక్టోబరులో 181, నవంబరులో 55, డిసెంబరులో 103 కేసులు చొప్పున తేలాయి. ఇక 2023 జనవరిలో 133, ఫిబ్రవరిలో 65, మార్చిలో ఇప్పటి వరకు 39 స్వైన్ ప్లూ కేసులు రికార్డు అయ్యాయి. సీజన్ మార్పులతో సహజంగా ప్లూ వ్యాప్తి ఉంటుందని, ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు.

పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సెక్రటరీ రిజ్వీకి కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్‌ భూషణ్‌ గురువారం లేఖ రాశారు. తెలంగాణలో ఈ వారం 267 కేసులు నమోదయ్యాయని, టెస్ట్ పాజిటివిటీ రేటు 0.31 శాతానికి పెరిగిందని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టెస్టుల సంఖ్య పెంచాలని, ట్రేసింగ్ చేయాలని సూచించారు. ప్రస్తుతం విస్తరిస్తున్న వేరియంట్‌ ఏదో తెలుసుకునేందుకు పాజిటివ్ వ్యక్తుల సాంపిల్స్‌ ను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించాలని సూచించారు. ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతాల్లో మాస్కులు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గడిచిన వారం రోజుల్లో 267 కరోనా కేసులు నమోదవగా, గురువారం 27 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చినట్టు ఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది.

‘హెచ్3 ఎన్2 కేసులు లేవు: డాక్టర్ జీ శ్రీనివాసరావు, డీహెచ్

రాష్ట్రంలో ఇప్పటి వరకు హెచ్3ఎన్2 కేసులు లేవు. సాధారణ ప్లూతో వచ్చే కేసులు మాత్రమే తేలుతున్నాయి. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో హెచ్3ఎన్2 కేసులు తేలుతున్నందున అప్రమత్తంగా ఉన్నాం. అన్ని ఆస్పత్రుల్లో సీవియర్ ప్లూ లక్షణాలతో వచ్చే వారి శాంపిళ్లకు హెచ్3ఎన్2 టెస్టులు చేపిస్తున్నాం. ఇప్పటి వరకు కొత్త ప్లూ పాజిటివ్లు తేలలేదు. ఏఆర్ఐ, ఐఎల్ఐ కేసులకు సింప్టమాటిక్ వైద్యంతోనే పేషెంట్లు కోలుకుంటున్నారు. కరోనా కేసుల్లోనూ స్వల్ప పెరుగుదల కనిపించింది. ప్రజలెవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వైద్యారోగ్యశాఖ అలర్ట్ గా ఉన్నది.


Next Story

Most Viewed