పరకాల పోరాటాల గడ్డ: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

by Disha Web Desk 11 |
పరకాల పోరాటాల గడ్డ: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
X

దిశ, హనుమకొండ టౌన్ : పరకాల నియోజకవర్గం పోరాటాల గడ్డ అని, పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఈ గడ్డ ప్రజలది అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం పరకాలలో జరిగిన హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా పరకాల బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పరకాల గడ్డపై దళారులు, దండుపాళ్యం ముఠా కట్టి దోచుకుంటున్నాయని, ఇక్కడి ఎమ్మెల్యే పేరులోనే ధర్మం ఉంది, కానీ ఆయన బుద్దిలో మాత్రం ధర్మం లేదు అని అన్నారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే దందాల సంగతి అందరికీ తెలిసిందేనని ఇక్కడ మొత్తం కాంట్రాక్టులు ధర్మా రెడ్డివే అని అన్నారు. ఏ దోపిడీలో చూసినా ధర్మారెడ్డి పేరే వినిపిస్తోందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూం, దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు తదితర హామీలలో ఏ ఒక్క హామి కూడా నెరవేర్చలేదన్నారు. ఈ ప్రభుత్వంలో పేదలకు ఒరిగిందేమి లేదని, రూ. 23లక్షల కోట్లు ఎవరింటికి పోయాయని ప్రశ్నించారు.

కాంగ్రెస్ హయాంలోనే పరకాల అభివృద్ధి..

పరకాల అభివృద్ధి కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిందేనని, కాంగ్రెస్ హయాంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందాయన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని కేటీఆర్ అడుగుతున్నారని, కాంగ్రెస్ ఏం చేసిందో వరంగల్ ఏకశిల పార్కు దగ్గర చర్చ పెడదాం, మీరు సిద్దమా చర్చకు అంటూ సవాల్ చేశారు. నేను చెప్పింది తప్పైతే ముక్కు నేలకు రాస్తానన్నారు. మీరు చెప్పింది తప్పైతే ప్రజలకు క్షమాపణ చెబుతారా? అని ప్రశ్నించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రతీ ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ కట్టినవేనని, సిద్దిపేట చింతమడకలో గుడి, బడి నీళ్ల ట్యాంక్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని అని అన్నారు. వేలాది ఎకరాలు ఆక్రమించుకొని మీరు ఫామ్ హౌసులు కట్టుకున్నారే తప్ప పేదలకు ఏం చేయలేదని ఆరోపించారు.

మీకు ఎలా మేం కుటుంబ సభ్యులం అవుతాం.?

నిజంగానే 4 కోట్ల తెలంగాణ ప్రజలు నీ కుటుంబమే అయితే, 10 ఎకరాలలో కట్టుకున్న ప్రగతి భవన్ కు పేదలను ఎందుకు రానివ్వడం లేదు? అని ప్రశ్నించారు. 12వందల మంది అమరవీరుల కుటుంబాలలో ఏ ఒక్కరికైనా ఇంటికి పిలిచి బుక్కెడు బువ్వ పెట్టారా..? అని అన్నారు. నిజంగా తెలంగాణ ప్రజలు మీ కుటుంబమే అయితే పీజీ విద్యార్థి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు..? అని అన్నారు. ఐదు రోజులైనా నేరస్తులను పట్టుకుని ఎందుకు శిక్షించలేదు.? అని మండిపడ్డారు. మీ ఇంట్లో బిడ్డను ఎవరైనా చంపితే ఇలాగే చేస్తారా? మీకు ఎలా మేం కుటుంబ సభ్యులం అవుతాం.? అని అన్నారు. అయినా మీరు మీ కుటుంబం అనుకుంటే, పరకాల సాక్షిగా మా తెలంగాణ కుటుంబం నుంచి మిమ్మల్ని బహిష్కరిస్తున్నాం, అని అన్నారు. మా తెలంగాణ కుటుంబంలో కల్వకుంట్ల కుటుంబం లేదు అని అన్నారు.

కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి

తెలంగాణ తెచ్చామని చెప్పుకున్నవారికి రెండుసార్లు అవకాశం ఇచ్చారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని ప్రజలను కోరారు. సోనియా కలలుగన్న తెలంగాణ రావాలంటే కాంగ్రెస్ గెలవాలి అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్లు లేని ప్రతీ పేదవాళ్లకు ఇళ్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తాం అని అన్నారు. గత ఏడాది వడగండ్ల వానకు 300 కోట్ల పంట నష్టం జరిగింది. వచ్చి చూసి వెళ్లిన మంత్రులు ఇప్పటివరకు పరిహారం అందించలేదు అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు పంట నష్టం చెల్లించే బాధ్యత మేం తీసుకుంటాం అని ప్రజలకు హామీ ఇచ్చారు.


Next Story

Most Viewed