తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ‘బలగం’ మొగిలయ్యకు ఆ స్కీం వర్తింపు

by Disha Web Desk 4 |
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ‘బలగం’ మొగిలయ్యకు ఆ స్కీం వర్తింపు
X

దిశ, నర్సంపేట: బలగం సినిమాలో కుటుంబ సభ్యుల ఆత్మీయతను చాటి చెప్పేలా ఎమోషనల్ పాట పాడి అందరి మనసులు గెలుచుకున్న పస్తం మొగిలయ్యకు దళిత బంధు మంజూరైంది. నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగ జంగాల కళాకారులు పస్తం మొగిలయ్య దంపతులు తమ కళ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. బలగం సినిమాతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్న మొగిలయ్య దంపతులను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బుధవారం క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని వారి యోగక్షేమాలను తెలుసు కున్నారు.

తన గాత్రంతో లక్షల మందిని కదిలించిన మొగిలయ్య దంపతులు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి మొగిలయ్య దంపతులు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో మాట్లాడిన ఎమ్మేల్యే వెంటనే వారికి దళిత బంధు పథకాన్ని మంజూరు చేయించారు. నమ్ముకున్న కలనే జీవనాధారంగా బ్రతుకు సాగిస్తున్న మొగిలయ్య కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కాగా మొగిలయ్యకు మెరుగైన చికిత్స కోసం ఎమ్మెల్యే కృషి చేశారు. మొగిలయ్య దంపతులకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చికిత్స చేయించడంతోపాటు దళిత బంధును కూడా మంజూరు చేయించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి బలగం మొగిలయ్య దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.


Next Story