కరీంనగర్ మేయర్ పీఠం పక్కా బీజేపీదే.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

కరీంనగర్ నగరపాలక సంస్థపై ఈసారి కాషాయ జెండా ఎగరడం ఖాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

కరీంనగర్ మేయర్ పీఠం పక్కా బీజేపీదే.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ నగరపాలక సంస్థపై ఈసారి కాషాయ జెండా ఎగరడం ఖాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన నగరంలోని రాజస్థాన్ చౌరస్తా, లయోలా కాలేజీ, బుట్టి రాజారాం కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల పరిస్థితి దారుణంగా ఉండబోతోందని జోస్యం చెప్పారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్ పనైపోయింది, వారు కేవలం 4 సీట్లకే పరిమితం కాబోతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తెర చాటు ఒప్పందాలతో కలిసినా 20 సీట్లు కూడా దాటలేవన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో కబ్జాలకు పాల్పడిన 9 మంది కార్పొరేటర్లను అరెస్ట్ చేయించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఆస్తులకు రక్షణ - ప్రజలకు భరోసా

ప్రజల ఆస్తుల రక్షణ బాధ్యత తనదని.. కబ్జాదారుల అంతు చూస్తానని బండి సంజయ్ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజల భూములను ఆక్రమించే నాయకుల భరతం పడతానని హెచ్చరించారు. తాను చచ్చి బతికి ప్రజలకు సేవ చేసేందుకే వచ్చానని, ఈ జన్మాంతం నగరం కోసం సేవకుడిలా పనిచేస్తానని భావోద్వేగానికి లోనయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి చెందుతోందని ఆయన స్పష్టం చేశారు. అమృత్ 2.0 పథకం కింద కరీనగర్ కార్పొరేషన్‌కు రూ.132 కోట్లు మంజూరయ్యాయని, వాటితో మల్కాపూర్, చింతకుంట ప్రాంతాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మల్కాపూర్, చింతకుంట గ్రామాల్లో సుమారు రూ.18 కోట్లతో కొత్త సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు టెండర్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. స్మార్ట్ సిటీ నిధులతోనే రేకుర్తి ముఖచిత్రం మారిందని, భవిష్యత్తులో రేకుర్తి నుంచి కొత్తపల్లి వరకు సెంట్రల్ లైటింగ్‌తో కూడిన అద్భుతమైన మార్గాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

Next Story