హోరెత్తనున్న జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం.. రంగంలోకి దిగనున్న సీఎం రేవంత్!

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-26 01:29:59  IST  )

జూబ్లీహిల్స్ ​ఉప ఎన్నికల ప్రచారాన్ని అధికార కాంగ్రెస్ మరింత రక్తి కట్టించనుంది.

హోరెత్తనున్న జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం.. రంగంలోకి దిగనున్న సీఎం రేవంత్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ​ఉప ఎన్నికల ప్రచారాన్ని అధికార కాంగ్రెస్ మరింత రక్తి కట్టించనుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా రంగంలోకి దిగనున్నారు. ఈనెల 30 నుంచి నాలుగు రోజుల పాటు రోడ్​షోలు నిర్వహించేలా అధికారపార్టీ ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో అధిక సంఖ్యలో ఉన్న సినీకార్మికులతో భారీసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈనెల 28న పోలీస్ గ్రౌండ్స్​లో సభకు శ్రీకారం చుట్టింది. ఈ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. సినీరంగ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేలా గతంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్మాతలు, సినీ ప్రముఖులను కూర్చోబెట్టి ఒప్పించారు. దీంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉపఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీకి ఓటు వేయాలని బహిరంగ సభ ద్వారా వారికి విజ్ఞప్తి చేయనున్నారు. సినీ కార్మికులు, ఆ నేపథ్యం కలిగిన వారి ఓట్లు ఈ​నియోజకవర్గంలో పది వేలకు పైగానే ఉంటాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో వారితో సభ నిర్వహించడం ద్వారా భారీ మెజార్టీ సాధించవచ్చని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.

అన్ని డివిజన్లు కవర్ అయ్యేలా రోడ్ షో..

ఈనెల 30 నుంచి నాలుగు రోజుల పాటు జూబ్లీహిల్స్​లోని ఆయా డివిజన్లలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్​షోలు నిర్వహించనున్నారు. ఈనెల 30, 31న, అలాగే వచ్చనెల​4, 5వ తేదీల్లో రోడ్​షోలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. సాయంత్రం వేళ రోడ్​షోలు ఉండేలా ప్లాన్​చేస్తున్నారు. ఒక్కో డివిజన్​లో ఒకటి రెండుచోట్ల ఆయన ప్రసంగించనున్నారు. అందుకోసం​మంత్రులు భారీ ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నాలుగు రోజులే కాకుండా అవసరమైతే మరో రోజు సైతం సీఎం రేవంత్​రెడ్డి రోడ్​షో నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సీఎం ప్రచారం ప్రారంభమైతే ప్రచారం మరింత వేగం పుంజుకుంటుందని, బాధ్యతలు అప్పగించిన మంత్రులు, ఎమ్మెల్యేలు మరింత సీరియస్​గా పనిచేస్తారని భావిస్తున్నారు. ఇద్దరు మంత్రులకు ఒక డివిజన్​చొప్పున బాధ్యతలు అప్పగించారు. ఒక్కోమంత్రికి నలుగురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్​చైర్మన్లకు బాధ్యతలు అప్పగించారు. వారంతా సీరియస్ గా రంగంలోకి దిగితే కాంగ్రెస్ ఎన్నికల​ప్రచారం మరింత ఊపందుకుంటుందని ముఖ్యనేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్​వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, సీతక్క విస్తృతంగా పర్యటిస్తున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ మరికొందరు మంత్రులు రంగంలోకి దిగనున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లో గెలవాల్సిందేనని సర్వశక్తులూ ఒడ్డుతున్నది.

Next Story