- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇండి’ కూటమికి జార్జ్ సోరోస్ ఆశీస్సులున్నాయి.. బీజేపీ స్టేట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్, ‘ఇండి’ కూటమి వంచనను ప్రధాని మోదీ ఎండగట్టారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అన్నారు.

దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండి’ (INDI) కూటమి చేస్తున్న మోసపూరిత రాజకీయాలను ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగం ద్వారా దేశ ప్రజల ముందు ఉంచారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కాంగ్రెస్, ఇండి కూటమికి కొన్ని దుష్టశక్తుల మద్దతు ఉందని, అందులో కొందరు ‘అర్బన్ నక్సల్స్’ కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ఓర్వలేక, కొందరు మేధావులు ఆయన ప్రసంగంపై ఎన్నికల సంఘానికి లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. ఇది కేవలం ప్రధానిపై ఉన్న అసూయతో చేస్తున్న చర్యేనని ఆయన కొట్టిపారేశారు.
‘జార్జ్ సోరోస్’ ఆశీస్సులు..
ఇండి కూటమికి, ఆ అర్బన్ నక్సల్స్కు అంతర్జాతీయ పెట్టుబడిదారుడు జార్జ్ సోరోస్ (George Soros) ఆశీస్సులు ఉన్నాయని రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వారంతా కలిసి దేశంలో అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రసంగం ఎన్నికల నియమావళిని ఎక్కడా ఉల్లంఘించలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని తన ప్రసంగంలో ఎక్కడా ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేయలేదని తెలిపారు. కేవలం కొన్ని రాజకీయ పార్టీలు మహిళలకు చేసిన అన్యాయాన్ని, దేశానికి జరుగుతున్న వంచనను ప్రజలకు వివరించారని ఇందులో తప్పేముందని రామచందర్ రావు ప్రశ్నించారు.






