ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విచారణ వాయిదా

by Disha Web Desk 2 |
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విచారణ వాయిదా
X

దిశ, తెలంగాణ బ్యూరో: మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో ఈడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (ఈసీఐఆర్)పై స్టే విధించాలని, ఎంక్వయిరీకి రావాల్సిందిగా జారీ చేసిన నోటీసును రద్దు చేయాలని, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా పడింది. మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేసిందే తాను అని పేర్కొన్న రోహిత్ రెడ్డి తనను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నిందితుడిగా భావించి కేసు నమోదు చేసి నోటీసు జారీ చేయడాన్ని తప్పుపటటారు. ఈడీ కేసును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌పై గతంలోనే విచారణ జరగ్గా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఈడీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆ ప్రకారం ఈడీ అధికారులు కౌంటర్ అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించారు.

రోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ సోమవారం విచారణకు రాగా, ఈడీ దాఖలు చేసిన కౌంటర్ అపిడవిట్‌ అంశం ప్రస్తావనకు వచ్చింది. దాన్ని చదివన తర్వాత వాదనలను కోర్టుకు వెల్లడిస్తానని రోహిత్‌రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఇందుకోసం గడువు ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. దాన్ని చదవకుండా తనపైన మోపిన అభియోగాలపై స్పందించలేనని తెలిపారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ఈడీ అఫిడవిట్‌పై అభిప్రాయాలను సిద్ధం చేసి కోర్టుకు సమర్పించాలని బెంచ్ ఆదేశించింది.


Next Story