TG: ఒక వేళ రిజర్వేషన్​అమలు కాకపోతే.. వారి మీదే బీసీ ఆశలు!

by Gantepaka Srikanth |

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. మండల, గ్రామ స్థాయి నేతలు ఇప్పటి నుంచే పదవుల కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

TG: ఒక వేళ రిజర్వేషన్​అమలు కాకపోతే.. వారి మీదే బీసీ ఆశలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. మండల, గ్రామ స్థాయి నేతలు ఇప్పటి నుంచే పదవుల కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం సైతం భావిస్తోంది. దీంతో గ్రామ, మండల స్థాయి నేతలు రిజర్వేషన్ల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 42% రిజర్వేషన్‌లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుంటే ఇక తమకు పండుగేనని, పెద్ద ఎత్తున అవకాశాలు వస్తాయని ఎంతో మంది ఆశతో ఎదురుచూస్తున్నారు. ఒక వేళ రిజర్వేషన్​అమలు కాక పోతే గతంలో కన్నా, రిజర్వేషన్లకు అతీతంగానే రాజకీయ పార్టీలు బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని అంచనాతో ఉన్నారు.

ఎవరి లెక్కలు వారివి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే సరికొత్త సమీకరణాలు రానున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రామ, మండల స్థాయిలో ఓసీలు, బీసీలు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. గతంలో ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్​స్థానాలు ఏ వర్గానికి రిజర్వ్​అయ్యాయి? ఈ సారి ఏ వర్గానికి రిజర్వ్​అయ్యే చాన్స్ ఉన్నాయనే దానిపై ఆరా తీస్తున్నారు. ఎక్కడ ఏ వర్గం జనాభా ఎక్కువగా ఉంది? ఏ స్థానం ఎవరికి రిజర్వ్​అవుతుంది? వంటి విషయాలను అంచనా వేస్తూ ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు.

స్థానికంలో పెరగనున్న బీసీల ప్రాతినిధ్యం

ఈ సారి బీసీలకు ఎలాగైనా టికెట్లు పెరుగుతాయని ఓసీ నేతలు అంచనాకు వచ్చారు. అధికారికంగా కాకపోయినా పార్టీ పరంగా అయినా వారికి కేటాయించే టికెట్ల సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్, వారికి సంబంధించిన సమస్యలపై పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సారి వారికి టికెట్లు పెంచక తప్పని అనివార్య పరిస్థితి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం ఖచ్చితంగా పెరుగుతుందని వెల్లడిస్తున్నారు.

నామినేటెడ్ పోస్టులపై ఇతరుల ఆశలు

ఎస్సీ, ఎస్టీలకు జనాభా ఎంత ఉంటే వారికి అంత రిజర్వేషన్​ఇవ్వాల్సిందేనని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. వారికి రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతే ఇతర వర్గాలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలు, ఆ తర్వాత బీసీలకు ఇలా మూడు వర్గాలకు పోగా ఉన్నవే ఇతరులకు కేటాయిస్తారు. దీంతో తమకు అవకాశాలు రాకుంటే నామినెటెడ్​పదవులపైనే ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుందని ఇతర సామాజిక వర్గానికి చెందిన నేతలు చెబుతున్నారు. ఆర్డినెన్స్, జీవోలు, కోర్టులు అంటూ ప్రచారం జరుగుతుండటంతో ఎన్నికల షెడ్యూల్​వచ్చేంత వరకూ ఎక్కువగా ఆవేశ పడొద్దని భావిస్తున్నారు.

Next Story