టీ.బీజేపీ MP అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం.. విడుదల అప్పుడే!

by Disha Web Desk 2 |
టీ.బీజేపీ MP అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం.. విడుదల అప్పుడే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీబీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల కమిటీకి అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఆశావహుల పేర్లతో జాబితాను రాష్ట్ర నాయకత్వం పంపించింది. ఇందులో ఏకాభిప్రాయం కుదిరిన పార్లమెంటు స్థానాలకు సంబంధించిన లిస్టును సైతం రాష్ట్ర పార్టీ పంపించేసింది. 8 నుంచి 10 పార్లమెంటు స్థానాల అభ్యర్థుల జాబితాను ఈ వారంలో ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఫస్టులో పది స్థానాలు

సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ప్రాతినిధ్యం వహిస్తున్నందున్న వారికే టికెట్లు కేటాయించాలని భావిస్తున్నారు. చేవెళ్ల, మహబూబ్ నగర్, భువనగిరి, మెదక్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలకు రెండు నుంచి మూడేసి పేర్లతో కేంద్ర పార్టీకి జాబితాను పంపించినట్లు తెలిసింది. మల్కాజిగిరి, జహీరాబాద్ ఎంపీ టికెట్ ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఆ పార్లమెంట్ స్థానాలను ప్రస్తుతానికి పక్కన పెట్టారని సమాచారం. ఆదిలాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు స్థానంలో కొత్త అభ్యర్థిని బరిలో దించాలని పార్టీ భావిస్తోంది.

సామాజిక కూర్పు

సిట్టింగ్ ఎంపీలతో పాటు మరో ఏడు స్థానాలను బీజేపీ తొలి జాబితాలో విడుదల చేసే అవకాశముంది. సామాజిక సమీకరణాలను సమతుల్యం చేసుకుంటూ టికెట్ల కేటాయింపు ఉండనున్నట్లు సమాచారం. బీసీలకు ఐదు స్థానాలకు తగ్గకుండా కేటాయించనున్నట్లు వినికిడి. మున్నూరు కాపు, గౌడ, ముదిరాజ్, యాదవ సామాజికవర్గాలకు సీట్లు కేటాయించి ఆయా వర్గాల ఓట్లు రాబట్టాలని అధిష్టానం ప్రణాళికలు చేస్తోంది. రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకోకుండా ఉండటంపైనా ఫోకస్ పెట్టిన పార్టీ.. మూడు స్థానాలకు తగ్గకుండా టికెట్లు కేటాయించాలని ప్లాన్ చేస్తోంది.

గత తప్పిదాలు రిపీట్ కాకుండా

గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావడంతో ఆశించిన స్థాయిలో స్థానాల్లో గెలువలేకపోయింది. ఈ సారి ఆ తప్పిదం జరగకుండా ఎన్నికల షెడ్యూల్‌కు 20 రోజుల ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కాషాయ దళం ప్లాన్ చేస్తోంది. ప్రత్యర్థి పార్టీల నుంచి బలమైన అభ్యర్థులను పార్టీలో చేర్చుకొని పోటీ చేయాలని యోచిస్తోంది. ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలో బీజేపీ బలహీనంగా ఉంది. ఎస్సీ రిజర్వ్‌గా ఉన్న నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ పార్లమెంటు స్థానాలను గెలిచేందుకు బీజేపీ వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం వెలువడితే ఈ మూడు స్థానాలను కైవసం చేసుకోవచ్చని కాషాయ పార్టీ లెక్కలు వేస్తోంది.

Next Story

Most Viewed