పేపర్స్ లీకేజీపై పోరు ఉధృతం.. 25న బీజేపీ ‘నిరుద్యోగ మహాధర్నా’

by Disha Web Desk 12 |
పేపర్స్ లీకేజీపై పోరు ఉధృతం.. 25న బీజేపీ ‘నిరుద్యోగ మహాధర్నా’
X

దిశ, తెలంగాణ బ్యూరో: పేపర్స్ లీకేజీ వ్యవహారం పై పోరును మరింత ఉధృతం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈనెల 25న ధర్నా చౌక్ లో ‘నిరుద్యోగ మహాధర్నాకు సిద్ధమవుతున్నది. ‘మా నౌకరీలు మాగ్గావాలే’ నినాదంతో, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలనే డిమాండ్లతో ఈ ధర్నాను చేపట్టనున్నది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ధర్నా కొనసాగనున్నది. అంతేకాకుండా పరీక్షలు రద్దు కావడంతో నష్టపోయిన ప్రతి నిరుద్యోగికి రూ. లక్ష చొప్పున పరిహారంగా అందించాలని కమలనాథులు డిమాండ్ చేస్తున్నారు.

పూర్తి నివేదికలతో..

తొమ్మిదేండ్లు కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఖాళీలెన్ని? భర్తీ చేసినవెన్ని? అనే అంశాలపై పూర్తి నివేదికను బీజేపీ తీసుకున్నది. ఈ ధర్నాలో భాగంగా వాటిని నిరుద్యోగులకు వివరించనున్నది. అంతేకాకుండా ప్రతిపక్ష నేతలైన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కి నోటీసులు జారీ చేసినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. తప్పు చేసిన వారిని కాకుండా ప్రశ్నించిన వారికి నోటీసులు ఇవ్వడమేంటనే ప్రశ్నను సామాన్యులు సైతం లేవనెత్తుతున్నారు.

త్వరలో ‘నిరుద్యోగ మార్చ్’

తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో మిలియన్ మార్చ్ కీలక ఘట్టం. ఇప్పుడు అదే తరహాలో నిరుద్యోగుల అందరినీ ఏకం చేసి నిరుద్యోగ మార్చ్ ను నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసుకున్నది. దానికంటే ముందు మహాధర్నాను చేపడుతున్నది. ధర్నాను సక్సెస్ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. యువతను చైతన్యవంతుల్ని చేసి ధర్నాకు తరలించాలని భావిస్తున్నది. ఇదిలా ఉంటే పేపర్ లీకేజీ అంశంలో బీజేపీ ఇప్పటికే టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది.

రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి చర్చిస్తున్నది. నిరుద్యోగుల ఇబ్బందులు తెలుసుకునేందుకు హైదర్ గూడ లేదా అశోక్ నగర్ లో కార్యాలయాన్ని, రాలేని వారి కోసం హెల్ప్ లైన్ నంబర్ ను సిద్ధం చేయనున్నది. జాల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలకు ప్లాన్ చేసింది. వీరందరినీ నిరుద్యోగ మార్చ్ లో భాగస్వామ్యమయ్యేలా ప్రణాళిక రచిస్తోంది.

మీడియాపై దాడులకు నిరసనగా..

మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై కేసీఆర్ సర్కార్ చేస్తున్న దాడులపై పోరాడాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా ఆయా సంస్థల కార్యాలయాలకు వెళ్లి జర్నలిస్టులకు సంఘీభావం తెలపాలని డిసైడ్ అయ్యారు. వివేక్, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులతో బండి సంజయ్ ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed