ఎన్నికల వేళ సర్కార్‌కు ‘TSPSC’ గండం.. యువత దూరం అవుతోందని BRS లో కొత్త టెన్షన్..!

by Disha Web Desk 19 |
ఎన్నికల వేళ సర్కార్‌కు ‘TSPSC’ గండం.. యువత దూరం అవుతోందని BRS లో కొత్త టెన్షన్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ తీరు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. రెండో సారి కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఏదో వివాదం చెలరేగుతూనే ఉన్నది. ఒక వేళ యాక్షన్ తీసుకుంటే తప్పు ఒప్పుకున్నట్టు ఒక మెసేజ్ వెళ్తుందని, ఈ వ్యవస్థను చక్కదిద్దకపోతే ఇంకెంత నిర్వాకం జరుగుతుందోననే భయం సర్కారును వెంటాడుతున్నది.

నిన్న మొన్నటి వరకు గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు గ్రూపు-2 పరీక్షల షెడ్యూలు విషయంలో కమిషన్‌పై విద్యార్థులు, నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. దీన్ని అధిగమించడం, యూత్‌లో కాన్ఫిడెన్స్ నెలకొల్పడం సర్కారుకు సవాలుగా మారింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న టైమ్‌లో టీఎస్‌పీఎస్సీ వ్యవహారం అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.

ఇప్పటికే బీఆర్ఎస్‌కు యూత్ దూరం

ఇప్పటికే విద్యార్థులు, యూత్, నిరుద్యోగులు పార్టీకి దూరమయ్యారని అధికార పార్టీ ఆందోళన చెందుతున్నది. వారిని ఆకట్టుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. కానీ అవేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. 81 వేల పోస్టుల భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ గతేడాది మార్చిలో అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. దానికి అనుగుణంగా టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసింది.

కానీ ఏడాది దాటినా ఇప్పటివరకూ ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టర్ములో కమిషన్ చైర్మన్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పనిచేసిన సమయంలో కొన్ని నోటిఫికేషన్ల విషయంలో లీగల్ చిక్కులతో కోర్టుల్లో కేసులు ఎదుర్కొన్నా.. పరీక్షల నిర్వహణలో ఎలాంటి రిమార్కు రాలేదు. తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జనార్ధర్ రెడ్డి చైర్మన్‌గా కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాతనే సర్కారుకు ఎక్కువ చిక్కులు వచ్చి పడ్డాయి.

అందిపుచ్చుకుంటున్న ప్రతిపక్షాలు

గ్రూప్-1 పరీక్షా ప్రశ్నపత్రాలు లీక్ వ్యవహారాన్ని కాంగ్రెస్ సీరియస్‌గా టేకప్ చేసింది. నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో గతంలో నిరసన కార్యక్రమాలను చేపట్టింది. యూత్‌ ఓటు బ్యాంకును దక్కించుకునేందుకు సరూర్‌నగర్ స్టేడియంలో ప్రియాంకాగాంధీ ఆధ్వర్యంలో ‘యూత్ డిక్లరేషన్’ ప్రకటించింది. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి సహా ఉద్యోగాల భర్తీపై నిర్దిష్టమైన హామీలు ఇచ్చింది. తాజాగా గ్రూప్-2 షెడ్యూలును మార్చాలంటూ టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన కార్యక్రమంలో కాంగ్రెస్‌కు ఆ పార్టీకి చెందిన అద్దంకి దయాకర్‌తో పాటు ఎన్ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట్ కూడా పాల్గొన్నారు.

గ్రూప్ 1 పేపర్ లీక్ విషయంలో బీజేపీ సైతం తనదైన శైలిలో స్పందించింది. బీజేపీ స్టేట్ చీఫ్‌గా బండి సంజయ్ ఉన్న సమయంలో మూడు జిల్లాల్లో నిరుద్యోగులతో ర్యాలీలు నిర్వహించారు. ఈ పేపర్స్ లీక్ ఇష్యూని టేకప్ చేసి రాష్ట్రవ్యాప్తంగా యూత్‌కు, నిరుద్యోగులకు ఆయన దగ్గరయ్యారు. మిలియన్ మార్చ్ పేరుతో హైదరాబాద్‌లో భారీ యాక్టివిటీకి ప్లాన్ చేసింది. ఒక దశలో టెన్త్ పేపర్ లీకేజీ విషయంలో ఆయన అరెస్టయ్యారు.

అంశం వేరైనా విద్యార్థులు, యువత, నిరుద్యోగులు బీజేపీవైపు నిలిచారు. కానీ ఈ లోపే బీజేపీ స్టేట్ చీఫ్ మారిపోవడంతో ఆ ప్లాన్ పక్కకుపోయింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ప్రభావం తగ్గిపోవడంతో మళ్లీ దగ్గర కావడం కోసం గ్రూప్-2 అభ్యర్థుల తాజా నిరసనలో బీజేవైఎం లీడర్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ దీన్ని పొలిటికల్ మైలేజీ కోసం వాడుకున్నా బీజేపీ మాత్రం దూరంగానే ఉండిపోయింది.

ముందుకు వెళ్లలేక.. వెనక్కి రాలేక

గ్రూప్-2 పరీక్షల రీషెడ్యూలుపై తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి రిక్వెస్టు చేశారు. జీరో అవర్‌లో కొద్దిమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఈ అంశాన్ని లేవనెత్తారు. సీఎం ఒక దశలో మిగిలిన పరీక్షలను రీషెడ్యూలు చేయడంపై ఆలోచిద్దాంగానీ.. గ్రూపు-2 విషయంలో మార్పులు ఉండవనే సంకేతాన్ని ఇచ్చారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ అయితే అది అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పొలిటికల్ మైలేజీగా ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ భావిస్తున్నది.

కానీ ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్షల రీషెడ్యూలు అంశం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. అన్ని సెక్షన్ల ప్రజల్లో ఎంతో కొంత విశ్వాసాన్ని చూరగొన్నా నిరుద్యోగుల విషయంలో ఉన్న నెగెటివ్ నుంచి బీఆర్ఎస్ బయటపడలేకపోతున్నది. అసలే నిరుద్యోగ భృతి హామీని అమలు చేయకపోవడంతో అధికార పార్టీపై విద్యార్థుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. విద్యాసంస్థలకు సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోవడం, స్కాలర్‌షిప్‌ల విడుదలలో జాప్యం కూడా బీఆర్ఎస్‌కు సంకటంగా మారింది.

వీటిని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తుండగానే.. టీఎస్పీఎస్సీ నిర్వహణలోని లోపాలతో ఊహించని చిక్కులు ఎదురవుతున్నాయి. ఇటు కమిషన్‌ను కట్టడి చేయలేక, అటు యూత్‌ను, విద్యార్థులను సంతృప్తిపర్చలేక అధికార పార్టీ సతమతమవుతున్నది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో దీనిని కొలిక్కి తీసుకురావడం కేసీఆర్‌కు తక్షణ కర్తవ్యంగా మారింది.

ఇవి కూడా చదవండి :

యువతకు ఉద్యోగాలు ఇవ్వని ద్రోహి CM KCR: మాజీ MP Pongulati Srinivas Reddy ఫైర్

స్టాఫ్ నర్సుల ఇష్టారాజ్యం.. ప్రశ్నించిన అధికారులపై లైంగిక దాడి కేసులు..?



Next Story

Most Viewed