ప్రోటోకాల్ వివాదం.. అధికార పార్టీలో రాజుకుంటున్న విభేదాలు

by Disha Web Desk 4 |
ప్రోటోకాల్ వివాదం.. అధికార పార్టీలో రాజుకుంటున్న విభేదాలు
X

దిశ, అలంపూర్ : నడిగడ్డలో ఓ ఎమ్మెల్యే అధికారి గల్లా పట్టుకున్న సంఘటన హల్‌చల్ అయింది. ఈ సంఘటన జరిగి రెండు రోజులు కూడా కాకముందే మరోసారి ప్రోటో‌కాల్ వివాదం అలంపూర్ నియోజకవర్గ మానవపాడు మండలంలో చోటుచేసుకుంది. మానవపాడు మండలం చెన్నిపాడు గ్రామంలో ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.5 లక్షలు కేటాయించి సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేపట్టారు. ఆ కార్యక్రమానికి అలంపూర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ వీ ఎం అబ్రహం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష హోదాలో ఉన్న మానవపాడు ఎంపీపీ కోట్ల అశోక్ రెడ్డిని ఆహ్వానించక పోవటం, అధికార పార్టీలో ఉన్న జడ్పీ చైర్మన్ సరితను పిలువక పోవడం వివాదాస్పదమైంది.

మండల ప్రజా ప్రతినిధిగా ఎంపికైన తనను ఎందుకు పిలువటం లేదని, గతంలో కూడా చాలా సార్లు ఇలాగే అవమానించారని అధికారికంగా జరిగే కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం తెరాస పార్టీలోనే అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.అధికార పార్టీకి ఒకలా.. ప్రతిపక్ష పార్టీకి మరోలా అంటూ చర్చ సాగుతోంది. మండలంలో చిన్నపాటి లీడర్లకు, నాయకులకు కూడా ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడిన వారికి కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేదని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఎంపీపీ కోట్ల అశోక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మానవపాడు మండల పరిషత్‌లో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించి ఆయన మాట్లాడారు.

పార్టీలకు తావివ్వకుండా అందర్నీ పిలుచుకునే సంస్కృతి మానవపాడు మండలంలో ఉండేదన్నారు. కానీ ఆ సంస్కృతిని మండల శాఖ అధికారులు మాత్రం విస్మరిస్తున్నారని మండిపడ్డారు. నిధులు ఎవరు మంజూరు చేసినప్పటికిని మండల ప్రజా ప్రతినిధులను పిలవడం అనేది ప్రోటో‌కాల్ అన్నారు. మండలంలో అలా జరగడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫోటో‌కాల్‌ను పాటించే విధంగా ఉద్యమిస్తామని, మరోసారి ఇలా జరగకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న తమని పిలవకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తామని చెప్పుకొచ్చారు. ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగన్మోహన్ నాయుడు, భీమేశ్వర్ రెడ్డి పరమేష్ తదితరులు ఉన్నారు.

తనకు కూడా ఆహ్వానం లేదు.. జడ్పీ చైర్మన్ సరిత

మానవపాడు మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు తనకు ఆహ్వానం లేదని, ఎక్కడ భూమిపూజ చేసినప్పటికిని అధికారుల నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రావడంలేదని జడ్పీ చైర్మన్ సరిత ఫోన్ ద్వారా తెలియజేశారు. ప్రోటో‌కాల్‌ను ఎందుకు విస్మరిస్తున్నారని ఇది ముమ్మాటికీ అధికారుల తప్పిదమని ఆమె మండిపడ్డారు. మా పార్టీలోనే విభేదాలు సృష్టించేలా అధికారుల చర్యలుంటున్నాయని మండిపడ్డారు.


Next Story

Most Viewed