పైరవీ చేస్తే టిక్కెట్ కట్.. కాంగ్రెస్ హైకమాండ్ హెచ్చరిక!

by Dishafeatures2 |
పైరవీ చేస్తే టిక్కెట్ కట్.. కాంగ్రెస్ హైకమాండ్ హెచ్చరిక!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ పార్టీలో టిక్కెట్లు ఆశించే నేతలకు హైకమాండ్ సీరియస్​ వార్నింగ్ ఇచ్చింది. క్షేత్రస్థాయిలో పనిచేయకుండా సీనియర్లు, ముఖ్య నేతలను నమ్ముకుంటే ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్ రాదని ఏఐసీసీ తేల్చి చెప్పింది. చాలా మంది అసెంబ్లీ సెగ్మెంట్ లలో ఆశించిన స్థాయిలో వర్క్​ చేయకుండా గాంధీభవన్ తో పాటు ముఖ్య నేతల చుట్టూ తిరుగుతున్నట్లు పార్టీ చెబుతున్నది. ఆ జాబితా ఏఐసీసీకి చేరినట్లు తెలిసింది. కొందరు ఢిల్లీ చుట్టూ కూడా తిరుగుతున్నారని, సీనియర్లతో రిఫర్​చేస్తే సహించేది లేదని పార్టీ నొక్కి చెప్పింది. ఏఐసీసీ సర్వేలో ప్రజల మన్ననలు పొందుతున్న నేతలకే టిక్కెట్లు వస్తాయని పార్టీ క్లారిటీ ఇచ్చింది. మూడు నెలల పాటు జనాల్లో సంపూర్ణంగా ఉండాలని, ఫలితాలు తప్పకుండా వస్తాయని పార్టీ రాష్ట్ర నేతలకు ఢిల్లీ హైకమాండ్ ఆదేశాలిచ్చింది. దీంతో ఆశావహులు, అభ్యర్థులు షాక్​ లో ఉన్నారు.

గతంలో ఇదే ట్రెండ్?

కాంగ్రెస్​ జాతీయ పార్టీ కావడంతో గతంలో టిక్కెట్ల పైరవీలు ఎక్కువగా జరిగేవి. ఢిల్లీతో పాటు రాష్ట్రానికి చెందిన కొందరు ముఖ్య లీడర్లు టిక్కెట్లు ఇప్పించే ప్రయత్నాలు చేసేవారు. తెలిసినోళ్లకు, అనుచరులకు, కుటుంబ సభ్యుల సీట్లు కోసం ఢిల్లీ అధిష్టానంతో సంప్రదింపులు చేసేవారు. ఈ నేపథ్యంలో పార్టీ కోసం కష్టబడినోళ్లు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయేవాళ్లు. పైగా ఎన్నికల్లోనూ పార్టీ చాలా సీట్లు కోల్పోవాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి అలాంటి తప్పిదాలు జరగకుండా సీట్ల పంపిణీలో పకడ్భందీగా ప్లాన్ చేస్తున్నది కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పటికే ఏఐసీసీ రెండు సర్వేలు చేయించింది. తాజాగా మూడో సర్వే కొనసాగుతున్నది. ఈ మూడు సర్వేల ఆధారంగా సీట్లను అనౌన్స్ చేయనున్నారు. కర్ణాటకలో ఇదే విధానం అమలు చేశామని ఓ కాంగ్రెస్​ నేత చెప్పారు.

Next Story

Most Viewed