మళ్లీ మొదటికొచ్చిన టీ-కాంగ్రెస్ పంచాయితీ.. ఒంటరవుతున్న రేవంత్ రెడ్డి!

by Disha Web Desk 2 |
మళ్లీ మొదటికొచ్చిన టీ-కాంగ్రెస్ పంచాయితీ.. ఒంటరవుతున్న రేవంత్ రెడ్డి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో మళ్లీ వర్గ పోరు మొదలైంది. థాక్రే ఎంట్రీ తర్వాత అంతా కలిసినట్టే మెలిగిన లీడర్లు, మళ్లీ మొదటికే వచ్చారు. ఒకే పార్టీలో రెండు యాత్రలు నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ‘హాథ్ సే హాథ్’ పేరిట యాత్ర నిర్వహిస్తుండగా, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి ‘తెలంగాణ పోరు యాత్ర’ పేరిట బైంసా నుంచి పాదయాత్రను షురూ చేశారు. ఏలేటి స్టార్ట్ చేసిన పాదయాత్రకు సీనియర్లంతా మద్ధతు ఇవ్వడం గమనార్హం. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కిసాన్ సెల్ సీనియర్ నేత కోదండ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి తదితరులంతా పాల్గొన్నారు. దీంతో తమ పార్టీ రెండు వర్గాలు చీలిపోయిందని స్వయంగా కాంగ్రెస్ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. ఎవరి వైపు ఉండాలనేది కూడా అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ లోని ముఖ్య లీడర్లు నిత్యం కొట్లాడుకుంటూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రేవంత్ ఒంటరేనా?

రాష్ట్రంలో రెండు వేర్వేరు పాదయాత్రలు జరుగుతుండటంతో కేడర్ కన్ఫ్యూజన్ లో ఉండటమే కాకుండా, పార్టీ పరువు కూడా పోతున్నదనే గాంధీభవన్ లోనే చర్చించుకుంటున్నారు. అయితే మొదటినుంచి రేవంత్ ను వ్యతిరేకిస్తున్న వాళ్లు తెలంగాణ పోరు పేరిట పాదయాత్రకు శ్రీకారం చూట్టారని పార్టీలోని కొందరు నాయకులు చెబుతున్నారు. దీనికి బలాన్ని చేకూరుస్తూ ఏలేటి పాదయాత్రకు సీనియర్లంతా మద్ధతు తెలపడం విశేషం. దీంతో ప్రస్తుతం రేవంత్ ఒంటరి నేతగా మిగిలే ఛాన్స్కనిపిస్తున్నది. పార్టీలోని చరిష్మా కలిగిన నేతలెవ్వరూ ఆయనతో తిరగడం లేదని మరి కొందరు లీడర్లు పేర్కొంటున్నారు. రేవంత్ సీనియర్ల కంటే.. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన లీడర్లకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ మొదటి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనికి నిరసనగా సీనియర్లు మరో అడుగు మందుకేసీ టీపీసీసీ అధ్యక్షుడు అని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా.. ఏలేటీకి సీనియర్లు మద్దతు ఇస్తున్నారంటే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. రేవంత్ చేస్తున్న యాత్రలో పాల్గొనని నేతలంతా మహేశ్వర్ రెడ్డి యాత్రలో భాగస్వామ్యం కావడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగలేడని సీనియర్లు ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు.

థాక్రే చర్చలు జరిపినా...

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి థాక్రే ఏలేటికి ఫోన్ చేసి చెప్పినా మహేశ్వర్రెడ్డి యాత్రను ప్రారంభించేశారు. నిర్మల్ వరకే పాదయాత్రను పరిమితం చేయాలని థాక్రే సూచించినా.. తాను మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పాదయాత్రను నిర్వహించి తీరుతానని నొక్కి చెప్పినట్లు తెలిసింది. తనకు హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఉన్నదని, ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించుకునే అవకాశం లేదని తేల్చేశారు. దీంతో థాక్రే కూడా ఏం చేయాలో తెలియక మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్ లో జరిగే పాదయాత్రకు శనివారం హాజరు అవుతానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. స్వయంగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి థాక్రే కోరినా.. పార్టీ శ్రేయస్సు కోసం మహేశ్వర్ రెడ్డి మెట్టు దిగలేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి మహేశ్వర్ రెడ్డికి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో మంచి పేరు ఉన్నది. కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీ బలోపేతం కోసం కృషిచేస్తాడనే అభిప్రాయం అందరిలోనూ ఉన్నది. అందుకే సీనియర్కాంగ్రెస్ నేతలంతా మహేశ్వర్ రెడ్డికే సపోర్టు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ లోని కీలక నేతలు పేర్కొంటున్నారు.

40 నియోజకవర్గాల్లో...

మహేశ్వర్రెడ్డి దాదాపు 40 నియోజకవర్గాలు అనుసంధానం చేస్తూ పాదయాత్ర చేసే చాన్స్ ఉన్నదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్, సంగారెడ్డి, పటాన్ చెరు మీదుగా తెలంగాణ పోరు యాత్ర హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ముగియనున్నది. అక్కడ భారీ సభను కూడా నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ప్లాన్ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని సీనియర్ కాంగ్రెస్ నేతలంతా మహేశ్వర్ రెడ్డి పాదయాత్రలో పాల్గొనే చాన్స్ ఉన్నది. దీంతో పాటు ఇప్పటికే అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ చార్జిలుగా ఉన్న నేతలు కూడా తెలంగాణ పోరు యాత్రలో లో భాగస్వామ్యం కానున్నారని మహేశ్వర్రెడ్డి వర్గం ప్రకటించింది.

Next Story

Most Viewed