బిగ్ న్యూస్: తెలంగాణ సర్కార్‌కు షాక్.. ఆ పథకానికి నిధులు నిలిపేసిన కేంద్రం!

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: తెలంగాణ సర్కార్‌కు షాక్.. ఆ పథకానికి నిధులు నిలిపేసిన కేంద్రం!
X

ఆర్కేవీవై పథకానికి కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ విడుదల చేయడం ఆపేసింది. 2020-21 నుంచి ఈ స్కీమ్‌కు నిధులను నిలిపివేసింది. ఉన్న నిధులను వినియోగించుకోకపోవడం, యుటిలైజేషన్ సర్టిఫికెట్లను సమర్పించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న బీఆర్ఎస్, రైతుల కోసం కేంద్రం విడుదల చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : రాజకీయ కక్షతో కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతున్నదని ఓ వైపు అధికార బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నది. నిధులు విడుదల చేస్తున్నా వాటిని రాష్ట్రం సద్వినియోగం చేసుకోలేకపోతున్నదని కేంద్రం వాదిస్తున్నది. ఇది బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రాజకీయ పోరుకు దారితీసింది. అయితే ఆర్కేవీవై (రాష్ట్రీయ కృషి వికాస్ యోజన) పథకానికి నిధులు విడుదల కాకపోవడం మరోసారి చర్చకు దారితీసింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ స్కీమ్ కింద 2014-15 మొదలు 2019-20 వరకు మొత్తం రూ. 895.68 కోట్లు విడుదలయ్యాయి. అందులో రాష్ట్రం 638.85 కోట్లను మాత్రమే ఖర్చు పెట్టింది.

ఇంకా రూ. 256.83 కోట్లు రాష్ట్రం దగ్గర మిగిలే ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలేదని, ఖర్చు చేయకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటున్నది. కేవలం తొలి రెండు సంవత్సరాల్లో మాత్రమే పూర్తి స్థాయిలో రూ. 315.56 కోట్లను ఖర్చు చేసిందని, ఆ తర్వాత నుంచి వరుసగా మూడేండ్ల పాటు నిధులు సంపూర్ణంగా వినియోగించకుండా మిగిలిస్తున్నదని పేర్కొన్నది. దీనికి తోడు స్కీమ్ నిబంధనలకు అనుగుణంగా ఏయే అవసరాలకు ఈ నిధులను ఖర్చు చేశారో రాష్ట్ర ప్రభుత్వం నుంచి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అందలేదని చెబుతున్నది. యూసీలు ఇవ్వకపోతే తదుపరి ఇన్‌స్టాల్‌మెంట్ విడుదల కుదరదని స్పష్టం చేసింది.

ఖర్చు కాని రూ. 256.83 కోట్లు

నిధులను ఖర్చు చేయకపోవడం, యూసీలు సమర్పించకపోవడంతో ఆర్కేవీవై కింద 2020-21 నుంచి తెలంగాణకు కేంద్రం నిధులను నిలిపివేసింది. చివరి విడతగా 2019-20లో రూ. 261.17 కోట్లను విడుదల చేయాలని బడ్జెట్‌లో కేటాయించింది. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ. 130.59 కోట్లను ఇచ్చింది. కానీ అందులో ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ రాతపూర్వకంగా చెప్పింది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రూ. 256.83 కోట్లు వినియోగం కాకుండా మిగిలిపోయాయని పేర్కొన్నది.

ఇదేనా రైతు సంక్షేమం?

రైతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా.. వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని నినాదిస్తున్న బీఆర్ఎస్ రైతుల అవసరాల కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయకపోవడంపై విరమ్శలు వస్తున్నాయి. కేంద్రం నిధులు ఇవ్వడంలేదని మంత్రి కేటీఆర్ తరచూ ఆరోపణలు చేస్తున్న సమయంలో, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి వివరణ రావడం గమనార్హం. నిధుల వినియోగంలో నిర్లక్ష్యం కారణంగా 2020-21 నుంచి 2022-23 మధ్య మూడేళ్ల కాలంలో రూ. 570 కోట్లను రాష్ట్ర అందుకోలేకపోయింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా కేంద్రం నుంచి ఈ స్కీమ్‌ల కింద నిధులు అందడం అనుమానంగానే ఉన్నది. దీంతో ఆర్కేవీవై కింద అమలవుతున్న నేషనల్ మిషన్ ఫర్ ప్రోటీన్ సప్లిమెంట్ (ఎన్ఎంపీఎస్), క్లస్టర్ డెవలప్‌‌మెంట్ ప్రోగ్రాం (సీడీపీ), అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ డెవెలప్‌మెంట్ ప్రోగ్రాం (ఏఎఫ్డీపీ), షెడ్యూల్డ్ క్యాస్ట్స్ సబ్ ప్లాన్ (ఎస్సీఎస్పీ), ట్రైబల్ సబ్ ప్లాన్ (టీఎస్పీ), స్టేట్ అగ్రి కల్చర్ ప్లాన్ లాంటి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను బలోపేతం చేసి రైతులను ఆర్థికంగా పరిపుష్టి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తున్నది.


Next Story

Most Viewed