అదానీ అంశంపై చర్చ అంటే ప్రభుత్వం పారిపోతోంది: కేకే, నామా

by Disha Web Desk 2 |
అదానీ అంశంపై చర్చ అంటే ప్రభుత్వం పారిపోతోంది: కేకే, నామా
X

దిశ, డైనమిక్ బ్యూరో: అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చ చేపట్టాలని కోరితే ప్రభుత్వం పారిపోతోందని బీఆర్ఎస్ ఎంపీలు కే.కేశవరావు, నామానాగేశ్వరరావు విమర్శించారు. మూడు రోజులుగా చర్చ జరపాలని వాయిదా తీర్మానాలు ఇస్తుంటే సభ ఆర్డర్‌లో లేదని వాయిదా తీర్మానాలు పరిగణనలోకి తీసుకోకుండా చర్చ జరగనివ్వకుండా ప్రభుత్వం తప్పించుకుంటుందన్నారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన వీరు అదానీ అంశంపై చర్చించేందుకు రూల్ 267 కింద నోటీసు ఇస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్రం ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడుస్తోందని ప్రతిపక్షాలు చర్చ కోరుకుంటుంటే, అదానీ తన స్నేహితుడైనందున ప్రధాని మోడీ పార్లమెంట్‌లో చర్చ జరగనివ్వడం లేదని ఆరోపించారు. తమ పరిధికి లోబడే ఎల్ఐసీ, ఎస్ బీఐలు అదానీ షేర్లు కొనుగోలు చేశారని కేంద్రం చెబుతోంది. ఆ పరిధి పరిమితిపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఏపీలో పోర్టులు అదానికి కట్టబెట్టారు. ముంబై ఎయిర్ పోర్టు కట్టబెట్టారు. కేసులు పెట్టించి జీవీకే ముంబై ఎయిర్ పోర్టు నుంచి తప్పుకునేలా చేశారు.

అదానీకి సంబంధించి అనేక అంశాలు చర్చకు రావాల్సి ఉంది. అదానీ షేర్ల ధర పెంచి చూపడం,షేర్లు పడిపోవడం,తక్కువ సమయంలో అత్యంత ధనవంతుడుగా ఎలా ఎదిగారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశాన్ని దోచుకుంటుంటే దర్యాప్తు, చర్చ జరపరా అని ప్రశ్నించారు. చర్చ జరిగితే అదానీ షేర్లు మరింత పడిపోతాయని చర్చ జరగనివ్వడం లేదని అందుకే పూర్తి రోజును వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే అదానీకి అండగా ఉన్నట్లు కనబడుతోందని ధ్వజమెత్తారు. కనీసం దేశ సమస్యలపై కూడా ప్రభుత్వం చర్చ జరపడం లేదని అన్నారు. ఈ అంశాన్ని వదిలే ప్రసక్తే లేదని రేపు కూడా అదానీ అంశంపై నోటీసులు ఇచ్చి చర్చకు పట్టుపడతామన్నారు. కేంద్ర బడ్జెట్ రైతు, పేదల వ్యతిరేక బడ్జెట్ అయితే రాష్ట్ర బడ్జెట్ మాత్రం రైతులు, పేదల బడ్జెట్ అన్నారు.

రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాలను ముందుకు తీసుకువెళ్లేలా ఉందని అన్నారు. రైతు బంధు, దళిత బంధు పథకాలకు నిధులు కేటాయించారని, విద్య వైద్యకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారన్నారు. తెలంగాణ సాధించుకున్న తరువాత అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నామని, ఐటీ, సేవల రంగాల్లో ఏడాదికి లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. కేంద్ర సహకారం అందుకున్నా.. ప్రాజెక్టులు నిధులు రాకున్నా తెలంగాణ అభివృద్ధి చేసుకుంటున్నామని ఇతర రాష్ట్రల వారు హైదరాబాద్ కు షిప్ట్ అవుతున్నారని చెప్పారు. అందరూ బాగుపడలని కోరుకునే రాష్ట్రం తెలంగాణ అని, రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రమే నిధులు కేటాయించాల్సి ఉన్నా అందులో సగం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. దేశ వృద్ధి రేటులో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది. కేంద్రం సహకారం లేకున్నా అభివృద్ధిలో దూసుకుపోతున్నదని చెప్పారు.


Next Story