పర్మిషన్ లేని అడ్మిషన్!

by Disha Web Desk 12 |
పర్మిషన్ లేని అడ్మిషన్!
X

ప్రయివేటు వర్సిటీల బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించకపోయినా.. రాష్ట్రంలో గురునానక్ యూనివర్సిటీ పేరుతో అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. గతేడాదే సుమారు మూడు వేల మందికి ప్రవేశాలు కల్పించగా, వచ్చే విద్యాసంవత్సరంలో అడ్మిషన్ల కోసం వర్సిటీ సిబ్బంది ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు, స్టూడెంట్స్‌కు ఫోన్లు చేస్తున్నారు. తమ వర్సిటీలో చదివితే ప్లేస్‌మెంట్స్ ఈజీగా వస్తాయని ఆశ కల్పిస్తున్నారు. ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘాల నాయకులు ఫైర్ అవుతున్నారు. ప్రయివేటు వర్సిటీ బిల్లుకు ఆమోదం రాకుండానే విద్యార్థులను చేర్పించుకుంటున్నారని, వారి భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారే ప్రమాదముందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అనుమతి లేకున్నా అడ్మిషన్లు చేపడుతున్నారని గురునానక్ వర్సిటీపై ఫిర్యాదులు వస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదు. గత ఏడాది సుమారు మూడు వేల మంది విద్యార్థులను వర్సిటీలో చేర్పించుకున్నారు. ఈ సంవత్సరం కూడా ప్రవేశాలు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దల ఆశీస్సులు ఉండటంతోనే ఇలా వర్సిటీ మేనేజ్మెంట్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వ పరిశీలనకు బిల్లు

కొత్తగా ఆరు ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు గత ఏడాది ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదించినా, గవర్నర్ ఇంతకాలం పెండింగ్ లో పెట్టారు. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో, ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటు బిల్లుపై మరింత అదనపు సమాచారం కోరుతూ రాజ్ భవన్ వర్గాలు ప్రభుత్వానికి లేఖ రాశాయి. గవర్నర్ అడిగిన సమాచారం ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో, బిల్లు ఆమోదానికి ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కానీ గురునానక్ వర్సిటీ 2023–24 అకడమిక్ ఇయర్ కోసం అడ్మిషన్ల పక్రియను ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది అడ్మిషన్లు తీసుకున్న స్టూడెంట్స్ భవిష్యత్తుపైనే ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదు.

పేరెంట్స్, స్టూడెంట్స్‌కు ఫోన్లు

వచ్చే ఏడాది అడ్మిషన్లు తీసుకోవాలని ఇంటర్ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్, వారి పేరెంట్స్ కు యూనివర్సిటీ నుంచి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. వర్సిటీలో డిగ్రీ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్‌కు వెంటనే ప్లేస్ మెంట్స్ దొరుకుతాయని ఆశ చూపుతున్నారు. అనుమతి లేని వర్సిటీలో పూర్తి స్థాయిలో అడ్మిషన్లు చేపట్టేందుకు మేనేజ్మెంట్ సుమారు 50 మంది కౌన్సిలర్లను నియమించి, తల్లిదండ్రులకు ఫోన్లు చేయిస్తున్నట్టు తెలిసింది. దీనిపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు వెళ్లాయి. గత ఏడాది నిర్వహించిన పరీక్షలకే ఇంకా యూజీసీ గుర్తింపు ఇవ్వలేదు. మరి వచ్చే ఏడాది గుర్తింపు ఇవ్వాలంటే ముందుగా వర్సిటీకి అనుమతి ఉండాలని అధికారులు చెబుతున్నారు.

కీలక మంత్రి ఆశీస్సులు!

అనుమతి లేకున్నా అడ్మిషన్లు ఇచ్చేందుకు వర్సిటీ మొగ్గుచూపడం వెనుక ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి హస్తం ఉందని ప్రచారం జరుగుతున్నది. అందుకే వర్సిటీ ఎన్ని నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అనుమతి లేని వర్సిటీ పై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినా సర్కారు స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

Next Story

Most Viewed