అలా అన్నందుకే తాతయ్యను చంపేశా.. కీలక విషయాలు వెల్లడించిన కీర్తితేజ

by Yella Dhawani Reddy |

ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్థనరావు(86) అతడి మనువడు కిలారు కీర్తితేజ చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.

అలా అన్నందుకే తాతయ్యను చంపేశా.. కీలక విషయాలు వెల్లడించిన కీర్తితేజ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్థనరావు(86) అతడి మనువడు కిలారు కీర్తితేజ చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్య జరిగిన మరుసటి రోజే నిందితుడు కీర్తితేజను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇక ఈ కేసులో నిందితుడైన కీర్తితేజను పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకుని విచారించగా, కీలక విషయాలు వెల్లడించారు. ప్రతిరోజూ తన తాత జనార్దన్‌రావు అవమానించేవాడని, అది భరించలేకనే ఈ ఘోరానికి పాల్పడినట్లు కీర్తితేజ తెలిపాడు.

కీర్తితేజ మొదటి రోజు పోలీసుల విచారణకు అస్సలు సహకరించలేదు. తన తాతయ్యను ఎందుకు హత్య చేశావంటూ పోలీసులు ఎంత ప్రశ్నించినా నోరు మెదపలేదు. వింతచూపులు చూస్తూ తనలో తాను మాట్లాడుకున్నాడు. రెండవ రోజు పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. అప్పటినుంచి విచారణ వేగవంతమైనట్లు తెలిపారు. తన తాతయ్య జనార్థనరావు ప్రతి రోజూ తనని యూ బెగ్గర్ అంటూ అవమానించేవాడని, ఏ రోజూ తనను సొంత మనిషిగా చూడలేదని తెలిపాడు. అలాగే ఆఫీసుకు వెళ్లిన అవమానించేవాడని, దీంతో ఆఫీసులో తనకు మర్యాద లేకుండాపోయిందని చెప్పాడు. చివరికి ఆస్తి పంపకాలు, పదవుల కేటాయింపుల్లో సైతం తక్కువ చేశారని, డైరెక్టర్‌ పదవి కూడా జనార్దన్‌రావు రెండవ కుమార్తె కొడుకుకు ఇచ్ఛాడని, అప్పటినుంచి తనకు, తాతకు మధ్య గొడవలు పెరిగాయని చెప్పాడు.

అందుకే తాతను చంపేయాలని నిర్ణయించుకుని ప్లాన్‌ చేసుకున్నానని తెలిపాడు. అందులో భాగంగా ఇన్‌స్టామార్ట్‌ నుంచి కత్తి కొనుగోలు చేశానని చెప్పాడు. హత్య జరిగిన రోజు తనకు తాతకు మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిందని, తనకు వాటా కావాలని అడిగితే ఇవ్వను పొమ్మనడంతో కోపంతో కత్తితో కసితీరా పొడిచి చంపేసి తర్వాత అక్కడినుంచి పారిపోయానని కీర్తి తేజ తెలిపాడు. ఆ తర్వాత బీఎస్‌ మక్తా ఎల్లమ్మగూడ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కత్తి, రక్తంతో ఉన్న తన బట్టలను తగలబెట్టినట్లు కీర్తి తేజ వివరించినట్లు పోలీసులు తెలిపారు. జనార్దన్‌రావును చంపుతుంటే అడ్డం వచ్చిన తల్లిపై కూడా కత్తితో దాడి చేశాడు.

ఇక, అయితే మంటల్లో కత్తి కాలిపోకుండా అలాగే ఉండడంతో పోలీసులు ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారణ అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు పోలీసులు చెప్పారు. కీర్తితేజ హత్యను అంగీకరించడం, సాక్ష్యాలు పోలీసుల చేతికి రావడంతో కేసు త్వరలో కోర్టుకు వెళ్లనుంది. ఇప్పటికే అతనిపై పలు అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఘటన పంజాగుట్టలో సంచలనం సృష్టించింది.

Next Story