TGPSC ఓటీఆర్ అప్‌డేషన్ మస్ట్.. ఫిబ్రవరి 25 వరకు గడువు పెంపు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-02 15:30:17  IST  )

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, త్వరలో విడుదల చేయబోయే ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో అభ్యర్థులందరూ తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ డేటాను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశించింది.

TGPSC ఓటీఆర్ అప్‌డేషన్ మస్ట్.. ఫిబ్రవరి 25 వరకు గడువు పెంపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, త్వరలో విడుదల చేయబోయే ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో అభ్యర్థులందరూ తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) డేటాను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఆదేశించింది. గతంలో పెండింగ్‌లో ఉన్న రిక్రూట్‌మెంట్ ప్రక్రియలన్నీ పూర్తి చేసిన కమిషన్, ఇప్పుడు కొత్త నియామకాలకు సిద్ధమవుతోంది. ఇటీవలి ఎస్సీ వర్గీకరణ, అభ్యర్థుల విద్యా అర్హతల్లో మార్పులు, అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఓటీఆర్ డేటాను కమిషన్ అప్‌డేట్ చేస్తోంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడానికి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో జాప్యాన్ని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 9 వరకు ఉన్న గడువును ఓటీఆర్ అప్‌డేట్ చేసుకోవడానికి ఫిబ్రవరి 25 వరకు పొడిగించారు. ప్రస్తుతం కమిషన్ వద్ద రిజిస్టర్ అయి ఉన్న సుమారు 31.56 లక్షల మంది అభ్యర్థులందరూ తమ వివరాలను సరిచూసుకోవాలని కమిషన్ పేర్కొంది. అభ్యర్థులు తమ వ్యక్తిగత, విద్యా, కేటగిరీ వివరాలను సరిచూసుకోవాలని, కొత్తగా పొందిన అదనపు విద్యార్హత సర్టిఫికెట్లు, ఈడబ్ల్యూఎస్, నాన్ క్రీమీ లేయర్ వివరాలు, లేటెస్ట్ కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు. అదనపు అర్హతలు, అడ్రస్, మొబైల్ నంబర్, ఈమెయిల్ వంటి కొన్ని వివరాలు మినహా మిగిలిన ప్రధాన ఫీల్డ్స్‌ మార్చుకోవడానికి వీలుండదు.

అభ్యర్థులకు హెచ్చరిక..

నిర్ణీత గడువు లోపు ఓటీఆర్ అప్‌డేట్ చేసుకోని అభ్యర్థులు భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు. ఓటీఆర్‌లో ఇచ్చే సమాచారాన్నే తుది సమాచారంగా పరిగణిస్తామని, అభ్యర్థులు అత్యంత జాగ్రత్తగా వివరాలను నమోదు చేయాలని కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ద్వారా తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.

Next Story