TG Govt.: రేషన్ కార్డుదారులకు తీపికబురు.. ఇకపై షాపుల్లో జొన్నల పంపిణీ!

by Kema Shiva Kumar |

తెలంగాణ రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది.

TG Govt.: రేషన్ కార్డుదారులకు తీపికబురు.. ఇకపై షాపుల్లో జొన్నల పంపిణీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో తెలంగాణ సర్కార్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు పౌష్టికాహారమైన జొన్నలను (Sorghum) కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు సంబంధించి ప్రభుత్వం ప్రాథమిక కసరత్తును వేగవంతం చేసింది. రాష్ట్ర మార్క్‌ఫెడ్ (MARKFED) ద్వారా సేకరించిన జొన్నలు, మొక్కజొన్నలను రేషన్ షాపుల ద్వారా ప్రజలకు నేరుగా అందుబాటులోకి తేవాలని అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు బలవర్థకమైన ఆహారం అందించడంలో భాగంగా జొన్నలను వినియోగించాలని భట్టి సూచించారు. కేవలం అన్నం మాత్రమే కాకుండా, చిరుధాన్యాల వాడకాన్ని పెంచడం ద్వారా ప్రజల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే ఈ జొన్నల పంపిణీ విధానం అమల్లోకి రానుంది.

రైతులకు గిట్టుబాటు ధరపై కీలక నిర్ణయం..

రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సర్కారు, జొన్నలు, మొక్కజొన్నలకు మద్దతు ధర కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో ధరలు తగ్గుతున్న నేపథ్యంలో, మొక్కజొన్నలతో పాటు జొన్నలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ తీర్మానించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు లేకపోయినప్పటికీ, రాష్ట్ర నిధులతోనే ఈ సేకరణ ప్రక్రియను చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) వెల్లడించారు. యాసంగి (Rabi 2026) సీజన్‌లో పండించిన పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

Next Story