TG Govt.: దావోస్ టూర్ గ్రాండ్ సక్సెస్.. తెలంగాణకు రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు

by Shiva |   ( Updated:2025-01-24 01:35:23.0  )
TG Govt.: దావోస్ టూర్ గ్రాండ్ సక్సెస్.. తెలంగాణకు రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి అండ్ టీమ్ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. అంతర్జాతీయంగా పేరొందిన సంస్థలకు చెందిన పారిశ్రామిక వేత్తలను కలుస్తూ.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను వారికి వివరిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులను ఆకర్షించింది. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక పెట్టుబడులు సాధించి కొత్త చరిత్రను లిఖించింది. దావోస్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి అండ్ టీమ్ మొత్తంగా రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు సాధించింది. గతేడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు రాగా.. ఈసారి నాలుగు రెట్లకు మించి రావడం విశేషం. ఈ టూర్‌లో మొత్తంగా 16 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించి భారీ పెట్టుబడులను సాధించింది. ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రంలో 49,500 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.

పారిశ్రామిక వేత్తలను ఆకర్షించిన ఫ్యూచర్ సిటీ..

దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రం ఈసారి అందరి దృష్టినీ ఆకర్షించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్‌లో వివిధ పారిశ్రామిక వేత్తలతో సమావేశాలను విజయవంతంగా నిర్వహించింది. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం ప్రపంచ దిగ్గజ పారిశ్రామిక వేత్తలను అమితంగా ఆకట్టుకుంది. దీంతో పాటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళికలు పెట్టుబడుల వెల్లువకు దోహదపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ రైజింగ్-2050 విజన్ గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. అన్ని రంగాలకూ అనుకూలమైన వాతావరణం ఉన్న హైదరాబాద్ గ్రేటర్ సిటీ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలిచి ప్రపంచానికి మరోమారు చాటిచెప్పినట్లు అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ.. ముఖ్యంగా ప్రపంచ పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది.

16 సంస్థల నుంచి పెట్టుబడుల వివరాలు ఇలా..

* సన్ పెట్రో కెమికల్స్ : ఈ సంస్థ భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. నాగర్‌కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లు రానున్నాయి. 3,400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో విద్యుత్.. 5,440 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. రూ.45,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా.. 7,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

* అమెజాన్ వెబ్ సర్వీసెస్ : ఏఐ, క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లలో రూ.60,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ముందుకొచ్చింది.

* కంట్రోల్ ఎస్ : ఈ సంస్థ తెలంగాణలో అత్యాధునిక AI డేటాసెంటర్ క్లస్టర్‌ ఏర్పాటు చేయనుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుండగా.. అందుకు రూ.10,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. తద్వారా 3,600 మందికి ఉపాధి లభించనుంది.

* జేఎస్‌‌డబ్ల్యూ : రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. ఇది రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో క్రియాశీలకంగా మారనుంది. అందుకు రూ.800 కోట్ల పెట్టుబడులు పెడుతుండగా.. 200 ఉద్యోగాలు రానున్నాయి.

* స్కైరూట్ ఏరో స్పేస్‌ : తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్‌ను స్కైరూట్ ఏరో స్పేస్‌ సంస్థ ఏర్పాటు చేయనుంది. దాని కోసం రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది.

* మేఘా ఇంజినీరింగ్ : మూడు కీలక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో 2,160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్‌తో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్, అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్‌నెస్ రిసార్ట్ ఏర్పాటు చేయనుంది. అందుకు రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఫలితంగా 5,250 మందికి ఉపాధి దొరకనుంది.

* హెచ్‌సీఎల్ టెక్ సెంటర్ : హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్‌ ఏర్పాటు చేసేందుకు రేవంత్ సర్కార్ ఆ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా 5,000 మందికి ఉపాధి లభించనుంది.

* విప్రో : హైదరాబాద్‌లో విప్రో కంపెనీ తన సేవలను విస్తరించబోతున్నది. గోపనపల్లి క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటు చేస్తుండగా.. దీని ద్వారా 5,000 మందికి ఉద్యోగాలు దొరకనున్నాయి.

* ఇన్ఫోసిస్ : హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను సైతం విస్తరిస్తున్నారు. పోచారంలోని ఐటీ క్యాంపస్‌‌లో కొత్త సెంటర్ ఓపెన్ కోసం ఆ సంస్థ రూ.750 కోట్ల పెట్టుబడులు పెడుతున్నది. ఫలితంగా 17,000 ఉద్యోగాలు రాబోతున్నాయి.

* యూనీ లివర్ కంపెనీ : కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థ ముందుకొచ్చింది. అదే విధంగా రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌లను ఉత్పత్తి చేసే కొత్త తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. వీటిలో దాదాపు 1,000 ఉద్యోగాలు రాబోతున్నాయి.

* టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ : హైదరాబాద్‌లో అత్యాధునిక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలోనే 300 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు అవుతోంది. అందుకోసం ఈ సంస్థ రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

* ఉర్సా క్లస్టర్స్ : అమెరికాకు చెందిన మరో కంపెనీ ఉర్సా క్లస్టర్స్ అత్యాధునిక ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్‌ను స్థాపించనుంది. అందుకు రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

* బ్లాక్‌స్టోన్ : ప్రపంచ అగ్రగామి సంస్థ బ్లాక్‌స్టోన్ హైదరాబాద్‌లో 150 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. రూ.4,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది.

* అక్షత్ గ్రీన్ టెక్ (మైత్రా ఎనర్జీ గ్రూప్ కంపెనీ) : అత్యాధునిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ఈ సంస్థ ఏర్పాటు చేయనుండగా.. ఇందుకు రూ.7,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నది.

* ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ : ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలో పేరొందిన ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ దాదాపు 800 మంది ఉద్యోగులకు సదుపాయం ఉండేలా హైదరాబాద్‌లో కొత్త ఆఫీసు ఏర్పాటు చేయనున్నది.

* సుహానా మసాలా, ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్‌ : సంగారెడ్డిలో ప్రస్తుతం ఉన్న సుహానా ప్లాంట్ పక్కనే కొత్తగా ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటును చేయబోతున్నట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story