గులాబీ బాస్ వ్యూహం.. బీఆర్ఎస్‌లో వారి ఆశలు గల్లంతేనా?

by Disha Web Desk 2 |
గులాబీ బాస్ వ్యూహం.. బీఆర్ఎస్‌లో వారి ఆశలు గల్లంతేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా రాజకీయ పార్టీలు తమ కసరత్తును వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో ఆశవాహుల అసంతృప్తులు క్రమంగా బహిర్గతం అవుతున్నాయి. గత ఎనిమిదేళ్లుగా ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున కారెక్కిన నేతలకు ఈ సారి టికెట్ దక్కుతుందో లేదో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ వైపు సిట్టింగ్‌లకే టికెట్ అని సీఎం కేసీఆర్ కన్ఫార్మ్ చేసినప్పటికీ ఎన్నికల నాటికి ఇదే మాటమీద ఉండటం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మరోవైపు రోజు రోజుకు పెరిగిపోతున్న ఆశావాహుల పోరును తగ్గించేందుకు కేసీఆర్ తనదైన రీతిలో ప్లాన్ అమలు చేస్తున్నాడని ఈ దెబ్బతో టికెట్‌పై కొంతమందికి ఆశలు వదులుకోవాల్సిందేననే అనే చర్చ తెరపైకి వస్తోంది. తల పండిన సీనియర్లకు సైతం ప్రాధాన్యత లేని కార్పొరేషన్ పదవులు కట్టబెట్టడం ద్వారా కేసీఆర్ టికెట్ల పంపకానికి రూట్ క్లియర్ చేసుకుంటున్నారనే అనే చర్చ గుప్పుంమంటోంది.

వారి ఆశలు గల్లంతేనా?:

రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ నేత సముద్రాల వేణుగోపాలాచారికి ఇటీవల ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఆయనకు అంతగా ప్రాధాన్యత లేని పదవిని కట్టబెట్టడం ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే ఆశావాహుల లిస్ట్ నుంచి తప్పించారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 2009లో ముథోల్ నుంచి గెలుపొందిన ఆయన అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో కారెక్కారు. ఆ తర్వాత 2014లో కారుగుర్తుపై పోటీ చేసి ఓటిమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన రాజకీయ భవిష్యత్ కు బీటలు వారాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్రమంలో మరోసారి అసెంబ్లీకి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నాటనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతలోనే కేసీఆర్ ఆయనకు కార్పొరేషన్ పదవి కట్టబెట్టడం ఆసక్తిగా మారింది. మరో వైపు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విషయంలోనూ కేసీఆర్ ఇదే వ్యూహం అమలు చేసినట్టు చర్చ జరుగుతోంది. 2018 ముందస్తు ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో చింతా ప్రభాకర్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఆయన నియోజకవర్గంలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్న చింతాప్రభాకర్ కు ఇటీవల సీఎం కేసీఆర్ హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి అప్పగించారు. దీంతో మరొకరికి టికెట్ ఇవ్వడం కోసమే చింతా ప్రభాకర్ ను కార్పొరేషన్ పదవి ఇచ్చారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

ఇంతటితో ఆగేనా?:

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆశావాహుల సంఖ్య మరింత పేరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గులాబీ అధినేత అసెంబ్లీ టికెట్ల విషయంలో ఇప్పటి నుంచే జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయానికి ఆశావాహులు తిరుగుబాటు చేస్తే అది మొదటికే మోసం వస్తుందని గ్రహించిన కేసీఆర్ వారిలో కొంత మందికి నామినేటెడ్ పదవులు అప్పగిస్తూ రూట్ క్లియర్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. మరి కొన్ని నెలల్లో తెలంగాణలో మరో ఆరు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ కాబోతున్నాయి. ఈ పోస్టులలో కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారికే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అసెంబ్లీ టికెట్ల పంపకాల సమయంలో అసమ్మతి లేకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో నా అనుచరులంతా పోటీ చేస్తారని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖలు బీఆర్ఎస్ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. తమ వర్గానికి టికెట్లు ఇవ్వకుంటే తిరుగుబాటు చేస్తామని ఇన్ డైరెక్ట్ గా సంకేతాలు ఇస్తున్నాడా లేక తమ మనసులో మాట మాత్రమే బయటకు చెప్పుకున్నాడా అనేది సస్పెన్స్ గా మారింది. మొత్తంగా బీఆర్ఎస్‌లో కార్పొరేషన్ పదవులు ఆశావాహుల ఆశలకు గండివేస్తోందనే చర్చ జోరుగా జరుగుతోంది.

Also Read...

KCR ఎక్కడైనా పోటీ చేయొచ్చు.BRSపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

Next Story

Most Viewed