అమ్మో చలి.. మరో రెండ్రోజులు గజగజ

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-19 00:27:52  IST  )

రాష్ట్రవ్యాప్తంగా ఎముకలు కొరికేలా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు గజగజలాడిపోతున్నారు.

అమ్మో చలి.. మరో రెండ్రోజులు గజగజ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఎముకలు కొరికేలా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు గజగజలాడిపోతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ గణనీయంగా పడిపోతుండటంతో పలు జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌‌కు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో రాగల రెండు రోజులు రాష్ట్రంలో భారీగా శీతల గాలుల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో శీతల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. చలి గాలుల కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరం అయితే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయరాదని సూచిస్తోంది

పటాన్‌చెరులో అత్యల్పంగా 6.4 డిగ్రీలు

రాష్ట్రంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత పటాన్‌చెరులో నమోదైంది. ఇక్కడ రికార్డు స్థాయిలో 6.4 డిగ్రీల సెంటిగ్రేడ్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఆదిలాబాద్‌లో 7.7 డిగ్రీ సెల్సియస్ నమోదైంది.‌ రాజేంద్రనగర్‌లో 8.5, మెదక్‌లో 9 డిగ్రీల‌ చొప్పున ‌కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర దిశ నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇగంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు.

Next Story