జూబ్లీహిల్స్ బైపోల్‌పై టీడీపీ ఫోకస్.. ఆ రెండు పార్టీలతో జత కట్టి గెలిచేలా వ్యూహం!

by Gantepaka Srikanth |

తెలంగాణంలో పూర్వవైభవం తీసుకురావాలని, మరోసారి రాష్ట్రంలో పాగా వేయాలని టీడీపీ అడుగులు వేస్తున్నది.

జూబ్లీహిల్స్ బైపోల్‌పై టీడీపీ ఫోకస్.. ఆ రెండు పార్టీలతో జత కట్టి గెలిచేలా వ్యూహం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణంలో పూర్వవైభవం తీసుకురావాలని, మరోసారి రాష్ట్రంలో పాగా వేయాలని టీడీపీ అడుగులు వేస్తున్నది. అందులోనే భాగంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం ఈనెల 15వ తేదీలోగా రాష్ట్రంలో మండల, పట్టణ, డివిజన్​కమిటీల నియామకం పూర్తిచేయాలని పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఆ తర్వాత పార్లమెంట్ కమిటీల ఎన్నికల కసరత్తు ప్రారంభమవుతుందని, పెండింగ్ లో ఉన్న ఆయా నియోజకవర్గాల కమిటీలను పూర్తిచేసి రాష్ట్ర కమిటీకి పంపించాలని సూచించింది. తెలంగాణలో ఆగస్టులో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని కమిటీలను వేసి వార్డులు, డివిజన్​వారీగా బాధ్యతలు అప్పగిస్తే కొన్ని చోట్లనైనా విజయం సాధించవచ్చని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు కమిటీలను పూర్తిచేశామని, అక్కడక్కడ మిగిలి ఉన్న కమిటీలను ఆయా నియోజకవర్గాల బాధ్యులు వేసేలా చూడాలని సూచించింది. ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ తెలంగాణ కూడా పాగా వేసేందుకు ప్లాన్​చేస్తున్నది. గ్రేటర్​హైదరాబాద్​తో పాటు సమీప జిల్లాల్లో సర్పంచులు, ఎంపీటీసీలను పోటీ చేయించి పార్టీని కాపాడుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అవసరమైతే బీజేపీ, జనసేనతో జత కట్టి అధికారదిశగా అడుగులు వేయాలని భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

జూబ్లీహిల్స్​ఉపఎన్నికపై గురి

త్వరలోనే హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్​నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనుంది. పోటీచేసి సత్తాచాటేందుకు టీడీపీ చీఫ్, ఏపీ సీఎం​చంద్రబాబు పార్టీ నేతలకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడ మెజార్టీగా టీడీపీ అభిమానులు ఉన్నారని ప్రస్తావిస్తున్నారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​కూడా మొదటిసారిగా టీడీపీ నుంచే పోటీచేసి విజయం సాధించారని గుర్తుచేస్తున్నారు. అక్కడ ఇంకా ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని ఈసారి కూడా పోటీచేస్తే గెలవచ్చని పార్టీ నేతలు పలు సమావేశాల్లో అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో పోటీచేసేందుకు ఇద్దరు ముగ్గురు నేతలు ఉత్సాహం చూపుతున్నట్లు ఎన్టీఆర్​భవన్​లో చర్చ నడుస్తున్నది. ఈ ఉప ఎన్నికతో తెలంగాణలో మరోసారి ఉనికి చాటేందుకు తెలుగు తమ్ముళ్లు కాలు దువ్వుతున్నారని రాజకీయ వర్గాల్లో టాక్​వినిపిస్తోంది.

Next Story