తెలంగాణ యువతకు న్యాయం జరగలేదు.. BRS సర్కారుపై ప్రియాంక గాంధీ ఫైర్

by Sathputhe Rajesh |

ఉద్యోగాల కోసం కలలు కన్న తెలంగాణ యువతకు న్యాయం జరగలేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు.

తెలంగాణ యువతకు న్యాయం జరగలేదు.. BRS సర్కారుపై ప్రియాంక గాంధీ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగాల కోసం కలలు కన్న తెలంగాణ యువతకు న్యాయం జరగలేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణ యువత స్వరాష్ట్రం సాధన కోసం కొట్లాడారన్నారు. ఎంతో మంది యువకులు అమరులయ్యారన్నారు. వారి రక్తం ఈ భూమిలో కలిసిపోయింది.. కానీ యువతకు న్యాయం జరగలేదన్నారు. ఎంతో కష్టపడి పరీక్షలు రాస్తే పేపర్ లీక్ చేసి జీవితాలు నాశనం చేశారు అని ఫైర్ అయ్యారు. తెలంగాణలో పేదలు మరింత పేదలు అవుతున్నారు.. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం మరింత ధనవంతులు అవుతున్నారని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ భువనగిరి రోడ్ షోలో ఆమె ప్రసంగించారు. మహిళలపై రోజూ అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. నిత్యావసర ధరలు పెరగడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై అవగాహన లేదని, సహాయం చేయాలన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆత్మహత్యలు జరుగుతన్నాయని, కానీ ఈ ప్రభుత్వం నిద్రపోతున్నదన్నారు.

రైతులకు లోన్లు రావు, రుణమాఫీ లేదు. ట్రాక్టర్లు, పనిముట్లు ఇవ్వలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసి, పేదలకు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదన్నారు. చిరు వ్యాపారులు, రైతులు, నిరుద్యోగులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సహాయం అందుతోందా అని రోడ్డు షోకు వచ్చిన ప్రజలను ప్రశ్నించారు. నోట్ల రద్దు, కరోనా, జీఎస్టీ విధింపు సమయాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, కానీ ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదన్నారు. పదేళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసని, మరి రాబోయే ఐదేళ్లు ఎవరిని ఎన్నుకోవాలో మీరే ఆలోచించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story