విపక్షాలు లేకుండానే కొత్త సచివాలయం ఓపెనింగ్‌

by Disha Web Desk 2 |
విపక్షాలు లేకుండానే కొత్త సచివాలయం ఓపెనింగ్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన కొత్త సచివాలయం భవనం ప్రారంభోత్సవానికి గవర్నర్‌తో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలకు ఆహ్వానం అందలేదు. విపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందినా వారు హాజరుకాలేదు. ఈ కార్యక్రమాన్ని దాదాపుగా వారు బహిష్కరించారు. ప్రోటోకాల్ పద్ధతి ప్రకారం తమకు ఆహ్వానాలు అందలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలెవరూ ఈ ఈవెంట్‌కు అటెండ్ కాలేదు. ప్రారంభోత్సవానికి వెళ్ళడంలేదంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ముందుగానే ప్రకటించారు. కరీంనగర్ ఎంపీ అయిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కూడా వెళ్ళనంటూ ప్రకటిస్తూనే సచివాలయం గుమ్మటాలను కూల్చి కొత్త డిజైన్ మార్చేంతవరకు ఆ భవనంలో అడుగుపెట్టేది లేదని స్పష్టం చేశారు. కేవలం అధికార పార్టీకి చెందిన నేతల సమక్షంలోనే ప్రారంభోత్సవ ప్రక్రియ ముగిసింది.

ప్రోటోకాల్ ప్రకారం సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి లేదా చీఫ్ సెక్రటరీ లేదా సీఎంఓ ఆఫీసు నుంచి పిలుపు వచ్చి ఉంటే ఆలోచించి ఉండేవారమని, కానీ జాయింట్ కలెక్టర్ల స్థాయిలో ఆహ్వానించి అవమానించారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ తరహాలోనే కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సైతం సొంత పార్టీ ప్రోగ్రామ్‌లాగా సాగింది. ఇక నుంచి విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గ అభివృద్ధి అవసరాల కోసం సచివాలయానికి వెళ్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కొత్త సచివాలయం నవనం నిర్మాణంపైనా, ప్రారంభోత్సవానికి అనుసరించిన విధానంపైనా విపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలకు తీవ్రమైన అసంతృఫ్తి ఉన్నందున భవిష్యత్తులో ఎలా ఉంటారన్నది ఆసక్తికరం.



Next Story

Most Viewed