నిఘా నీడలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌.. వీవీఐపీకు మూడంచెల భద్రత

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-29 02:39:44  IST  )

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మహేశ్వరం, మిర్ఖాన్‌పేటలో డిసెంబర్ 8, 9వ తేదీల్లో టీ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ నిర్వహిస్తున్నది.

నిఘా నీడలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌.. వీవీఐపీకు మూడంచెల భద్రత
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మహేశ్వరం, మిర్ఖాన్‌పేటలో డిసెంబర్ 8, 9వ తేదీల్లో టీ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ నిర్వహిస్తున్నది. ఈ సమ్మిట్‌ను దావోస్ సమ్మిట్ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ తన బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుకోవాలని, భవిష్యత్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా 500 కంటే ఎక్కువ పెద్ద కంపెనీలు, 2000 పైగా వ్యాపారవేత్తలు, నాయకులు, నిపుణులు ఈ సదస్సుకు హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ..

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఒక అంతర్జాతీయ సదస్సు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించడం, సాంకేతికత-ఆవిష్కరణ రంగాలలో రాష్ట్ర సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడం ఈ సమ్మిట్ యొక్క ముఖ్య లక్ష్యాలుగా పేర్కొన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంతో ఒక విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేయడం ఈ సమ్మిట్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. హైదరాబాద్ నగరాన్ని భారత్ ఫ్యూచర్ సిటీగా తీర్చిద్దిందుకు ప్రణాళిక రూపొందిచే లక్ష్యంగా సమ్మిట్ సాగనుంది.

వీవీఐపీ ప్రతినిధుల చుట్టూ భారీ భద్రత..

గ్లోబల్ సమ్మిట్‌కి పోలీసుశాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య భారీ బందోబస్త్ కల్పిస్తోంది. సీఎం ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ సమ్మిట్ నిర్వహిస్తునందున లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, డాగ్, బాంబ్ స్క్వాడ్స్‌తో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, రాచకొండ సీపీ సుధీర్ బాబు, టీజీ ఐసీసీ ఏండి శశాంక్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, వాటర్‌వర్క్స్ ఎండీ అశోక్‌రెడ్డి ట్రాఫిక్ డీసీపీలతో కలిసి సమ్మిట్ నిర్వహణ కమిటీ సభ్యులతో, వివిధ శాఖలతో సమన్వయ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సదస్సుకు సుమారు 2,500 మంది పోలీసు బలగాలు బందోబస్తు చేపట్టనున్నాయి. సమ్మిట్‌కి కావాల్సిన సదుపాయాలపై, బేరక్స్, మెస్, కిచెన్, టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయల గురించి అధికారులతో చర్చించారు. వీఐపీ ప్రతినిధుల చుట్టూ మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఈ ప్రాంతంలో అడుగడుగునా నిఘా పెట్టేందుకు సుమారు వెయ్యికిపైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సుమారు వెయ్యి మంది ట్రాఫిక్ పోలీసులను నియమించనున్నారు. సాధారణ ప్రజలు, వాహనదారులకు రెండు రోజుల పాటు ఆయా మార్గాలలో రహదారుల మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.

Next Story