సైబర్ క్రైమ్ యావరేజ్‌లో తెలంగాణ ఫస్ట్

by Yella Dhawani Reddy |

సంఖ్యా పరంగా తెలంగాణలో సైబర్ క్రైమ్స్ తక్కువగా ఉన్నా.. యావరేజ్ పరంగా చూసుకుంటే మాత్రం తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో కనిపిస్తున్నది.

సైబర్ క్రైమ్ యావరేజ్‌లో తెలంగాణ ఫస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో సైబర్ క్రైమ్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణలోనూ రూ.వేల కోట్లు సైబర్ క్రిమినల్స్ దోచుకుంటున్నారు. అయితే సంఖ్యా పరంగా తెలంగాణలో సైబర్ క్రైమ్స్ తక్కువగా ఉన్నా.. యావరేజ్ పరంగా చూసుకుంటే మాత్రం తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో కనిపిస్తున్నది. జనాభా ప్రాతిపదికన చూసుకుంటే ప్రతి 653 మందిలో ఒకరు సైబర్ క్రైమ్ బారినపడి డబ్బులు పోగొట్టుకున్న వారే ఉండడం గమనార్హం. అదే బిహార్‌లో 1,625 మందిలో ఒకరు బాధితుడిగాఉంటే.. బిహార్‌లో 2,225 మందిలో ఒకరు బాధితుడిగా ఉన్నారు. ఇటీవల నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) విడుదల చేసిన నివేదికలో ఈ విషయం స్పష్టమవుతున్నది.

ఆర్థికంగా నష్టపోయిన వారిని ఎంచుకొని..

బెట్టింగ్, బిజినెస్, ఇతర వ్యవహారాల ద్వారా ఆర్థికంగా నష్టపోయిన వారు, చదువుకున్నా ఉద్యోగం రాక నిరుత్సాహంగా ఉన్న వారిని విదేశాల్లో ఉన్న సైబర్ క్రిమినల్స్ ముందుగా టార్గెట్ చేస్తున్నారు. వారి ద్వారా ఒక నెట్వర్క్‌ను నడిపిస్తున్నారు. కమీషన్ల ఆశ చూపి అనేక మంది బ్యాంకు ఖాతాలు సేకరిస్తున్నారు. సైబర్ క్రైమ్స్ చేసి పొందిన డబ్బును ఆయా ఖాతాల ద్వారా వివిధ రూపాల్లో విదేశాలకు రప్పించుకుంటున్నారు. అయితే పోలీసుల దాడుల్లో సైబర్ క్రిమినల్స్‌కు సహకరిస్తున్న వారు పట్టుబడుతున్నారు.

అనేక పేర్లతో మోసాలు..

ఆశ, భయాలను ఆసరాగా చేసుకొని సైబర్ క్రిమినల్స్ నేరాలకు పాల్పడుతున్నారు. ఒకేసారి రూ. కోట్లు కొల్లగొడుతున్నారు. ట్రేడింగ్, బ్యాంక్ లోన్స్, డిజిటల్ అరెస్టుల పేరుతో ఒకేసారి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఇటీవల సైబర్ క్రైమ్ బ్యూరోలో వచ్చిన ఫిర్యాదులు దీనికి నిదర్శనం. బ్యాంక్ లోన్ ఇప్పిస్తామని హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారి నుంచి ప్రాసెసింగ్ ఫీజు పేరుతో రూ.1.5 కోట్లు కొల్లగొట్టారు. నిందితుడు నాగరాజును అరెస్ట్ చేసి, బ్యాంక్ అకౌంట్ మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. ట్రేడింగ్ పేరుతో రూ.1.98 కోట్లు పోగొట్టుకున్న ఓ బాధితుడు సైబర్ క్రైమ్ ను ఆశ్రయించాడు. నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమల్ పాల్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ మహిళను బెదిరించి రూ.కోట్లు మోసం చేశారు. ఈ కేసులో నిందితులు రాజ్ కుమార్, సుధాకర్‌లను అరెస్ట్ చేశారు.

రూ.102 కోట్లు రీఫండ్

రాష్ట్రంలో 2025 జనవరి నుంచి జూన్ వరకు సైబర్ క్రైమ్ ద్వారా రూ.726 కోట్లు బాధితులు నష్టపోయినట్లు తెలంగాణ సైబర్ క్రైం బ్యూరో వెల్లడించింది. ఇందులో రూ.102 కోట్లు బాధితులకు రీఫండ్ చేసినట్లు వెల్లడించింది. రూ.105 కోట్లు హోల్డ్ లో ఉంచినట్లు పేర్కొంది. 228 నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించింది. అయితే నిందితుల్లో ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్, బ్యాంకు ఉద్యోగులు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తున్నది.

తెలంగాణలో సైబర్ క్రైమ్స్ వివరాలు ఇలా..

సైబర్ క్రైమ్ 2025 (జూన్ వరకు) 2024 2023

నమోదైన కేసులు 58,176 1,14,174 91,652

పోగొట్టుకున్న మొత్తం రూ.726 కోట్లు రూ.1866.9 కోట్లు రూ.778.7కోట్లు

రీఫండ్ రూ.102 కోట్లు రూ.176.71కోట్లు రూ.8.36కోట్లు

హోల్డ్ చేసిన మొత్తం రూ.105 కోట్లు రూ.244.56 కోట్లు రూ.127కోట్లు

రాష్ట్రాల వారీగా బాధితుల యావరేజ్

రాష్ట్రం నమోదైన కేసులు జనాభా యావరేజ్

తెలంగాణ 58,176 3.8 కోట్లు 653 మందిలో ఒక బాధితుడు

తమిళనాడు 80,258 7.7కోట్లు 959 మందిలో ఒక బాధితుడు

మహారాష్ట్ర 1,60,633 12.8కోట్లు 796 మందిలో ఒక బాధితుడు

ఉత్తర ప్రదేశ్ 1,48,219 24.1కోట్లు 1,625మందిలో ఒక బాధితుడు

బీహర్ 58,857 13.1 కోట్లు 2,225 మందిలో ఒక బాధితుడు

Next Story