ఏఐతో స్మార్ట్ పోలీసింగ్.. డీజీపీ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం

by Naga Rani Yarlagadda |

నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఇకపై టెక్నాలజీ, ఏఐ వినియోగంతో పోలీసింగ్‌ను మరింత స్మార్ట్‌గా, వేగంగా, పారదర్శకంగా మార్చేందుకు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ పోలీసు ఏఐని విస్తృతంగా ఉపయోగించాలని నిర్ణయించారు.

ఏఐతో స్మార్ట్ పోలీసింగ్.. డీజీపీ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం
X
  • డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ టీమ్
  • సీసీటీఎన్‌ఎస్‌ 2.0, హాక్‌ఐ, ఏఐ ప్రాజెక్టులన్నీ ఒకే గొడుగు కిందకు..
  • ఐదుగురు ఐపీఎస్‌లతో కోర్ టీమ్

దిశ, తెలంగాణ బ్యూరో: నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఇకపై టెక్నాలజీ, ఏఐ వినియోగంతో పోలీసింగ్‌ను మరింత స్మార్ట్‌గా, వేగంగా, పారదర్శకంగా మార్చేందుకు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ పోలీసు ఏఐని విస్తృతంగా ఉపయోగించాలని నిర్ణయించారు.. ఇందుకోసం డీజీపీ కార్యాలయంలోనే శాశ్వత ప్రాతిపదికన ఒక ప్రత్యేక టెక్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం డీజీపీ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఒకే గొడుగు కిందకు అన్నీ..

ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ శాఖ విడివిడిగా ఉపయోగిస్తున్న తెలంగాణ పోలీసు అధికారిక వెబ్‌సైట్, హాక్‌ఐ, సీసీటీఎన్‌ఎస్ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్, హెచ్‌ఆర్‌ఎంఎస్ వంటి ప్రధాన సాంకేతిక ప్లాట్‌ఫారమ్‌లను ఇకపై డీజీపీ కార్యాలయం పరిధిలోకి తీసుకువచ్చి.. పనిచేయాల్సిన అవసరం ఉందని డీజీపీ స్పష్టం చేశారు. అధికారుల బదిలీలు లేదా మార్పులతో సంబంధం లేకుండా ఈ సాంకేతిక అప్‌గ్రేడేషన్ నిరంతరాయంగా సాగేందుకు వీలుగానే డీజీపీ కార్యాలయంలో శాశ్వత ప్రాతిపదికన ఈ టెక్ టీమ్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు. సాంకేతికతపై ఆసక్తి ఉండి, స్వచ్ఛందంగా సేవలందించేందుకు ముందుకొచ్చే యువ పోలీసు సిబ్బందిని ఈ బృందంలో చేర్చుకుంటామన్నారు. దీనివల్ల వారు సరికొత్త ఏఐ వ్యవస్థలను నేర్చుకోవడంతో పాటు, వాటి అభివృద్ధిలో చురుగ్గా భాగస్వాములు గా అదనపు డేటా లేయర్లను వేగంగా అనుసంధానించేందుకు వీలుగా ఒక కేంద్రీకృత హై స్పీడ్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.

కొత్తగా ఏఐ టాస్క్ ఫోర్స్..

పోలీసు శాఖ చేపట్టే అన్ని ఏఐ సంబంధిత ప్రాజెక్టులను పర్యవేక్షించేందుకు డీజీపీ కార్యాలయంలో ఒక ప్రత్యేక ఏఐ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ప్రస్తుతమున్న సీసీటీఎన్‌ఎస్, హెచ్‌ఆర్‌ఎంఎస్ వంటి వివిధ వ్యవస్థలను అనుసంధానిస్తూ టీఎస్ కాప్స్ పేరిట ఒకే ఉమ్మడి మొబైల్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించాలని డీజీపీ ఆదేశించారు. దీని ద్వారా సిబ్బంది ఒకే మొబైల్ ఇంటర్‌ఫేస్ యాప్ ద్వారా విధులకు సంబంధించిన వివిధ అప్లికేషన్లను యాక్సెస్ చేసే వీలుంటుందని వివరించారు. ఏఐ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లైన సీసీటీఎన్‌ఎస్ 2.0 అమలుకు, క్రైమ్ డేటా ఆధారిత డ్యాష్‌బోర్డుల రూపకల్పనకు వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఫైళ్ల కదలికలను నిరంతరాయంగా పర్యవేక్షించేందుకు వీలుగా డీజీపీ ఎస్టాబ్లిష్‌మెంట్ పరిధిలోని అన్ని కార్యాలయాలను ఈ ఆఫీస్ సిస్టమ్‌తో అనుసంధానించాలని ఆదేశించారు.

ఐదుగురు ఐపీఎస్‌లతో కోర్ టీమ్..

సాంకేతిక కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక ఫలితాలను ఇచ్చేలా.. ఏఐ ఆధారిత ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు వీలుగా.. ఐదుగురు ఐపీఎస్ అధికారులతో కూడిన ఒక ప్రత్యేక కోర్ టీమ్ ను ఏర్పాటు చేశారు. రాబోయే ఆరు నెలల్లోగా ఈ ప్లాట్‌ఫారమ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని డీజీపీ సీవీ ఆనంద్ సుచించారు..

కోర్ టీమ్..

హైదరాబాద్ జాయింట్ సీపీ ఎన్. శ్వేత: సీసీటీఎన్‌ఎస్ 2.0 అభివృద్ధి, హెచ్‌ఆర్‌ఎంఎస్ పర్యవేక్షణ, సీఐడీ విభాగంతో సమన్వయ బాధ్యతలు,

డీఐజీ ఆర్. భాస్కరన్: సీసీటీఎన్‌ఎస్ ప్రాజెక్టులో ఏఐ సాంకేతికతను అనుసంధానించే బాధ్యత.

డీసీపీ సి.హెచ్. రూపేష్ : సోషల్ మీడియా, వీడియో అనలిటిక్స్, ఏఐ ఆధారిత డ్రోన్ టెక్నాలజీస్ పర్యవేక్షణ,

ఎస్పీ కె. అపూర్వ రావు: డేటా ఇంటెలిజెన్స్, శిక్షణా కార్యక్రమాలు, సిస్టమ్ డిజైనింగ్.

ఐపీఎస్ అవినాష్ మొహంతి: ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ మోడ్యూళ్ల పర్యవేక్షణ బాధ్యతలను డీజీపీ అప్పగించారు.

ఈ సమావేశంలో డీజీ టెక్నికల్ సర్వీసెస్ వి.వి. శ్రీనివాసరావు, జాయింట్ సీపీ ఎన్. శ్వేత, డీఐజీ భాస్కరన్, ఎస్పీ అపూర్వ రావు, డీసీపీ సి.హెచ్. రూపేష్‌లతో పాటు సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.

Next Story