TSPSC పేపర్ లీకేజీలో మంత్రుల హస్తం.. YS షర్మిల సంచలన ఆరోపణ

by Disha Web Desk 2 |
TSPSC పేపర్ లీకేజీలో మంత్రుల హస్తం.. YS షర్మిల సంచలన ఆరోపణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ అంశంలో బోర్డ్ చైర్మన్ నుంచి మంత్రుల స్థాయి వరకు హస్తం ఉందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. లోటస్ పాండ్‌లోని తన నివాసంలో ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా ఆమె తొలుత టీఎస్ పీఎస్సీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఆమెను తన ఇంటివద్దే అడ్డుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. టీఎస్ పీఎస్సీలో జరిగింది పెద్ద స్కాం అని ఆమె ఆరోపించారు. అందరూ కుమ్మక్కయ్యే ఈ స్కాం చేశారన్నారు. బోర్డ్ చైర్మన్ దగ్గర నుంచి మంత్రుల స్థాయిలో హస్తం ఉందన్నారు. ప్రశ్న పత్రాలు కావాలనే లీక్ చేశారని, బోర్డ్ మొత్తాన్ని రద్దు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

దర్యాప్తు బాధ్యతలు సిట్ కి అప్పగించింది వారికి అనుకూలంగా నివేదిక ఇవ్వడానికే అని ఆమె పేర్కొన్నారు. అందుకే టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ అంశంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్సీ నిరుద్యోగుల విశ్వసనీయత కోల్పోయిందని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం టీఎస్ పీఎస్సీలో రిజిస్టర్ చేసుకున్నారన్నారు. బోర్డ్ చైర్మన్‌కి, సెక్రటరీకి వద్ద ఉండే పాస్ వర్డ్‌లు బయటకు ఎలా లీకయ్యాయని ఆమె ప్రశ్నించారు. అంగట్లో సరుకులు అమ్మినట్లు టీఎస్ పీఎస్సీ పేపర్లు అమ్ముతున్నారని షర్మిల మండిపడ్డారు. ఒక్క ఏఈ పేపర్ మాత్రమే కాదని, గ్రూప్ 1, ఇతర అన్ని పేపర్లు లీకయ్యే ఉంటాయని ఆమె అనుమానం వ్యక్తంచేశారు.

లీకేజీ అంశంపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సిగ్గుపడాలని విమర్శలు చేశారు. టీఎస్ పీఎస్సీ సర్వర్ ఎలా హ్యాక్ అవుతుందని ప్రశ్నించారు. కవిత కేసుల మీద ఉన్న శ్రద్ధ టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్‌పై లేకుండా పోయిందని కేటీఆర్‌పై విమర్శలు గుప్పించరాఉ. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై ఇంత వరకు స్పందించలేదని మండిపడ్డారు. కేసీఅర్ ఒక మోనార్క్ అని, ఒక నియంత అని విమర్శలు చేశారు. కేసీఅర్ ఒక తాలిబాన్ అని, తాలిబాన్ అధ్యక్షుడని విరుచుకుపడ్డారు. తెలంగాణలో కేసీఅర్ సొంత రాజ్యాంగం అమలవుతోందన్నారు. ప్రశ్న పత్రాలను సంతలో అమ్మినట్లు అమ్మడం కేసీఅర్ రాజ్యాంగమని ఆమె చురకలంటించారు.

Next Story

Most Viewed