ఎన్నికల ఎఫెక్ట్: విదేశీ పర్యటనలకు సిద్ధమైన తెలంగాణ మంత్రులు!

by Disha Web Desk 2 |
ఎన్నికల ఎఫెక్ట్: విదేశీ పర్యటనలకు సిద్ధమైన తెలంగాణ మంత్రులు!
X

రాష్ట్ర మంత్రులు ఫారిన్ టూర్‌కు క్యూ కడుతున్నారు. కొందరు అధికారిక ప్రోగ్రామ్స్ అంటూ వెళ్తుండగా..ఇంకొందరు ఫ్యామిలీస్‌తో కలిసి పర్సనల్‌గా వెళ్తున్నారు. ఈ మధ్య ప్రభుత్వంలో పెద్దగా హడావుడి లేదు.. జూన్ ఫస్ట్ వరకూ చెప్పుకోదగ్గ అధికారిక కార్యక్రమాలూ లేవు. మంత్రి హోదాలో విదేశాల్లో పర్యటిస్తే ప్రొటోకాల్‌గా ఉంటుంది. దీనికి తోడు రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలు కానున్నది. అప్పుడు ఫ్యామిలీకి టైం ఇవ్వడం కుదరదని, సమయం ఉన్నప్పుడే వెళ్తే రిలాక్స్‌‌గా ఉంటుందని కొందరు మంత్రులు చెబుతున్నట్టు టాక్.

దిశ, తెలంగాణ బ్యూరో: అంబేడ్కర్ విగ్రహం, సెక్రటేరియట్ ఓపెనింగ్ ప్రోగ్రామ్స్ పూర్తయ్యాయి. జూన్ ఫస్ట్ వరకు చెప్పుకోదగ్గ అధికారిక కార్యక్రమాలేమీ లేవు. వేసవి సెలవులు ఉండడంతో పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. దీంతో మంత్రులు ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. కొందరు ఇప్పటికే పర్యటనలు ముగించుకొని హైదారాబాద్‌కు చేరుకున్నారు. మంత్రి హోదాలో విదేశీ పర్యటనకు వెళ్తే ప్రొటోకాల్‌ ఉంటుంది. పదవిలో ఉన్నప్పుడే ఫారిన్ టూర్లకు వెళ్లేందుకు ఎక్కువ మంది మంత్రులు ఇంట్రస్ట్ చూపుతున్నట్లు తెలిసింది.

ఆగస్ట్ నుంచి ఎలక్షన్స్ హడావుడి

ఆగస్టులో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలు కానున్నది. ఈ లోపే మంత్రులు అన్ని అధికారిక ప్రోగ్రామ్స్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. పనిలో పనిగా ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ కోసం కొన్ని రోజులు కేటాయిస్తున్నారు. ఆగస్టు నుంచి ఎన్నికల రిజల్ట్స్ వచ్చే వరకు దాదాపు నాలుగు నెలల పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండక తప్పదు. అందుకని ఇప్పుడే కుటుంబంతో కలిసి విదేశీ విహార యాత్రలకు ప్రయారిటీ ఇస్తున్నట్లు చర్చ జరుగుతున్నది.

యూఎస్ టూర్‌లో హరీశ్‌రావు

రెండు రోజుల క్రితం మంత్రి హరీశ్‌రావు కుటుంబంతో కలిసి యూఎస్ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 18 వరకు అక్కడే ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. హరీశ్‌రావు కుమారుడు యూఎస్‌లో డిగ్రీ చదువుతున్నారు. కొడుకు విద్యనభ్యసిస్తున్న కాలేజీలో జరగనున్న గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌కు ఆయన హాజరుకానున్నారు. ఆ తర్వాత అక్కడే ఉంటున్న కొందరు సన్నిహితులతో సమావేశం కానున్నట్లు తెలిసింది.

యూకే పర్యటనలో కేటీఆర్

మంత్రి కేటీఆర్ అధికారిక పర్యటనలో భాగంగా బుధవారం యూకేకు వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం కోసం బ్రిటన్‌కు వెళ్తున్నట్టు ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మంత్రి అక్కడే ఈనెల 13వ తేదీ వరకు ఉండి, వ్యాపార, వాణిజ్య సంఘాలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అయితే కేటీఆర్‌తో పాటు కొందరు సన్నిహితులు కూడా వెంట ఉన్నట్లు తెలిసింది.

జర్మనీ వెళ్లొచ్చిన జగదీశ్ రెడ్డి

మంత్రి జగదీశ్ రెడ్డి జర్మని టూర్ ముగించుకుని ఇటీవలే హైదరాబాద్‌కు చేరుకున్నారు. సుమారు నాలుగైదు రోజుల పాటు ఆయన ఫ్యామిలీతో కలిసి ఆ దేశంలో పర్యటించారు. మంత్రి కొడుకు అక్కడ డిగ్రీ చదువుతుండటంతో అతన్ని చూసేందుకు కుటుంబ సభ్యులతో పాటు వెళ్లినట్టు సమాచారం.

10 రోజులు యూఎస్‌లో గడిపిన కొప్పుల

మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫిబ్రవరి 27 నుంచి పది రోజుల పాటు యూఎస్‌లో పర్యటించారు. ఆయన ఫ్యామిలీతో కలిసి ‘నార్త్ సాల్ట్ లేక్ సిటీ ఫ్యామిలీ సెర్ప్ ఇంటర్నేషనల్’ ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రామ్‌కు హాజరయ్యారు.

త్వరలో మరికొంత మంది

మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్ కూడా విదేశీ యాత్రలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి కోసం విదేశాల్లో అమలు చేస్తున్న పద్ధతులను అధ్యయనం చేసేందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెళ్తున్నట్టు సమాచారం. అయితే మంత్రి గంగుల కూడా ఆయనతో పాటు వెళ్లే అవకాశమున్నదని అధికార వర్గాలు తెలిపాయి. కరీంనగర్ సిటీలోని మానేరు రివర్ ఫ్రంట్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు విదేశాల్లో ఉన్న వివిధ ప్రాజెక్టులను అధ్యయనం చేయనున్నట్టు సమాచారం.

Next Story

Most Viewed