రూ.10 కాయిన్లతో బైక్ కొన్న తెలంగాణ వ్యక్తి... వీడియో వైరల్

by Prasad Jukanti |

రూ.1.10 లక్షల తన బైక్‌ను పూర్తిగా రూ.10 నాణేలు చెల్లించి కొనుగోలు చేశాడో వ్యక్తి. ఈవీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

రూ.10 కాయిన్లతో బైక్ కొన్న తెలంగాణ వ్యక్తి... వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొంత మంది తాము చేసే పనిలో వినూత్నంగా ఉంటాలని కోరుకుంటారు. అందరిలా కాకుండా ఏదైనా సరికొత్తగా చేసే పనులు ఒక్కోసారి సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారుతుంటాయి. తాజాగా బైక్ కొనుగోలు చేయాలనుకున్న తన కలను సాకారం చేసుకునే క్రమంలో ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. తన కలల బైక్‌ను కొనుగోలు చేయడానికి ఎంచుకున్న మార్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏకంగా లక్ష రూపాయలకు పైగా విలువైన బైక్‌ను పూర్తిగా పది రూపాయల నాణేలు ఇచ్చి కొనుగోలు చేశాడు. నల్లగొండ (Nalgonda) జిల్లా చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన కొండే రఘుపతి అనే వ్యక్తికి ఒక బైక్ కొనాలనేది కల. ఇందుకోసం ఆయన చాలాకాలంగా రూ.10 నాణేలను పొదుపు చేస్తూ వచ్చాడు. అలా జమ చేసిన నాణేలన్నింటినీ ఇటీవల కవర్లలో నింపుకుని స్థానిక శ్రీ వినాయక మోటార్స్ షోరూమ్‌కు చేరుకున్నారు. రూ.1.10 లక్షల విలువైన బైక్ కోసం మొత్తం సొమ్మును పూర్తిగా రూ.10 కాయిన్ల రూపంలోనే చెల్లించారు.

గంటల పాటు లెక్కించిన షోరూమ్ సిబ్బంది:

రఘుపతి తెచ్చిన పది రూపాయల కాయిన్లను చూసి షోరూమ్ సిబ్బంది మొదట ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ నాణేలన్నింటినీ కిందపోసి, సిబ్బంది అంతా కలిసి గంటల తరబడి ఓపికగా లెక్కించారు. మొత్తం సొమ్ము సరిపోవడంతో రఘుపతికి బైక్‌ను అందజేశారు. కాయిన్లను షోరూమ్ సిబ్బంది లెక్కిస్తున్న ఈ వినూత్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో, నెటిజన్లు ఆ యువకుడి పొదుపును, పట్టుదలను అభినందిస్తుండగా షోరూమ్ నిర్వహకుల ఓపికకు సెల్యూట్ అంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.

Next Story